చైనాపై ఆధారపడకుండా కేంద్రం స్కెచ్! వీటితో ఆంధ్రప్రదేశ్ రెడీ, యోగి ఆన్లైన్ దారి
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలు ఎక్కువగా చైనా నుండి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాయి. భారత్ కూడా ఎక్కువగా చైనా దిగుమతులపై ఆధారపడుతోంది. ఇప్పుడు కరోనా మహమ్మారి నేపథ్యంలో చైనా నుంచి సరఫరా కాకపోవడం లేదా కొన్ని వస్తువుల్లో జాప్యం ఏర్పడింది. దీంతో చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని పెట్టుబడిదారులు, వివిధ కంపెనీలు మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చైనా నుంచి వచ్చే కంపెనీలకు భూమిని సిద్ధం చేయడంతో పాటు రాష్ట్రాలు కూడా సొంతగా పెట్టుబడులు ఆకర్షించాలని సూచిస్తోంది.
'లక్సెంబర్గ్'తో డబుల్.. చైనాను వదిలే కంపెనీలకు ఇండియా ఆఫర్! ఆంధ్రప్రదేశ్తో ఆ కంపెనీల చర్చలు
చైనాపై ఆధారపడకుండా... ఉద్యోగ, ఉపాధి
భారత్తో వాణిజ్య సంబంధాలు కలిగిన టాప్ 4 దేశాల్లో జపాన్, అమెరికా, సౌత్ కొరియా, చైనా ఉన్నాయి. ఈ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం వ్యాల్యూ 179.27 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ 2000 నుండి డిసెంబర్ 2019 మధ్య ఈ దేశాల నుండి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 68 బిలియన్ డాలర్లకు పైగా వచ్చాయని ప్రభుత్వ డేటా వెల్లడిస్తోంది. చైనాపై ఆధారపడటం తగ్గించడంతో పాటు కంపెనీలను ఆకర్షించడం ద్వారా వేలు, లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కల్పించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో చైనా నుండి వచ్చే కంపెనీలను ఆకర్షించేందుకు మోడీ ప్రభుత్వం భూమిని కూడా సిద్ధం చేస్తోంది.
విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా..
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒక వివరణాత్మక స్కీం ఈ నెలాఖరు వరకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ వ్యూహాలపై చర్చించేందుకు ఏప్రిల్ 30న ప్రధాని మోడీ సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాలతోను పలు కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీతో జపాన్, యూఎస్, సౌత్ కొరియా కంపెనీలు చర్చలు జరుపుతోన్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్కు ఇది అసెట్
ఆంధ్రప్రదేశ్కు తీరప్రాంతం ఉందని, అలాగే రెడీమేడ్ ఇండస్ట్రియల్ పార్క్ ఉందని, ఇవి అవసరమైన క్లియరెన్స్లతో సిద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ డిపార్టుమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ చెబుతున్నారు. అంతేకాదు, ప్రధానంగా ఐటీ సెక్టార్, సంబంధిత మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్ రంగాలపై దృష్టి సారించామని, పెట్టుబడులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారట.
యూపీలో ఏరోస్పేస్, రక్షణ రంగాలపై యోగి ప్రభుత్వం దృష్టి
మరోవైపు, ఉత్తర ప్రదేశ్ కూడా పెట్టుబడులపై దృష్టి సారించింది. పారిశ్రామిక, వాణిజ్య ప్రయోజనాల కోసం భూమిని కేటాయించేందుకు ఆన్ లైన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకు ప్రపంచస్థాయి సంస్థలతో చర్చలు జరుపుతోంది.