గోల్డ్ ETFలలోకి పెట్టుబడుల వెల్లువ, ఫిబ్రవరిలో రూ.491 కోట్లు
గోల్డ్ ETFలలోకి పెట్టుబడుల వరద పారుతోంది. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (GOLD ETF)లో పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఆసక్తి కనబరుస్తున్నట్లు ఫిబ్రవరిలో వచ్చిన పెట్టుబడులు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరిలో రూ.491 కోట్ల మేర గోల్డ్ ETFలలోకి పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవలి ఆల్ టైమ్ గరిష్టం నుండి 20 శాతానికి పైగా పసిడి ధరలు పడిపోయాయి. ఇది ఇన్వెస్టర్లను మరింత ఆకర్షించిందని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది జనవరి నెలలో గోల్డ్ ETFలలోకి నికరంగా రూ.625 కోట్ల మేర పెట్టుబడులు రాగా, ఫిబ్రవరిలో మాత్రం వేగం తగ్గింది.
2020 డిసెంబర్ నెలలో రూ.431 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే గత ఏడాది నవంబర్ నెలలో రూ.141 కోట్లు గోల్డ్ ETFs నుండి బయటకు వెళ్లాయి. 2020 సంవత్సరం మొత్తం మీద గోల్డ్ ETFలలో రూ.6,657 కోట్ల మేర ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. మార్చి, నవంబర్ మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ఈ నెలల్లో మాత్రం బయటకు వెళ్లాయి. నవంబర్ నెలలో పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్లు దేశీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2021లోనే బంగారం 9 శాతం మేర దిద్దుబాటుకు గురయింది. గోల్డ్ ఇన్వెస్టర్లు మరింత దిద్దుబాటు ఉంటుందని భావిస్తున్నారు. బంగారం ధరలు తగ్గినందున ఇన్వెస్టర్లు తమ పోర్ట్పోలియోకు అదనంగా జోడిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.