వాటిని ఆపకుంటే కష్టం: ఆర్థిక వ్యవస్థపై గౌతమ్ అదానీ హెచ్చరిక, గ్రామాల నుండి సిటీలకు వద్దు!
భారత ఆర్థికవృద్ధిపై పారిశ్రామికవేత్తలు, ఆయా కంపెనీల అధిపతులు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ 70 కనిష్టానికి పడిపోయే ప్రమాదం కనిపిస్తోందని, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి పని ప్రదేశాల నుండి గ్రామాలకు తిరిగి వెళ్లిన 140 మిలియన్ల వలస కార్మికులను వెనక్కి తీసుకు రావడం ద్వారానే సాధ్యమని ఇటీవల ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. తాజాగా బిలియనీర్ గౌతమ్ అదానీ కూడా గ్రామీణ వలసల గురించి హెచ్చరించారు.
70 ఏళ్ల కనిష్టానికి భారత్, వారంతా తిరిగిరావాలి: ఆర్థికవ్యవస్థపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
నిరోధించకుంటే వృద్ధిపై ప్రభావం
గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలను నిరోధించకుంటే మన దేశ వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని గౌతమ్ అదానీ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చేలా ఒక నమూనాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే భారత వృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఆయన ఇండియన్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్(గుజరాత్, ఆనంద్) జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
కొన్ని మైగ్రేషన్స్ వల్ల ప్రయోజనాలు.. కానీ
క్లస్టర్ ఆధారిత విధానాలను తీసుకు రావాలని అదానీ చెప్పారు. డిజిటల్ టెక్నాలజీని వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యునిట్లను ప్రోత్సహించేందుకు వినియోగించాలని పిలుపునిచ్చారు. మన దేశంలో మైగ్రేంట్ వర్కర్లు 100 మిలియన్లకు పైగా చేరుకున్నారని, ప్రతి నలుగురు వర్కర్లలో ఒకరు మైగ్రేంట్ అన్నారు. కొన్ని వలసల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, కానీ అంతకుమించిన వలసలను గ్రామీణం నుండి పట్టణానికి నిరోధించే నమూనా అవసరం అన్నారు. గ్రామీణ-పట్టణ అసమతౌల్యత, అసమాన అవకాశాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని సూచిస్తోందన్నారు.
గ్రామీణ ఆర్థిక నమూనాను అభివృద్ధి చేయాలి
ప్రస్తుతం చాలామంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లారని, వీరికి అక్కడే ఉపాధి లభించేలా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అదానీ చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామీణ ఆర్థిక నమూనాను ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో స్థానిక జనాభాను స్థానికంగానే ఉపయోగించుకోవాలన్నారు. మన స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ కూడా రైతులను ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూయర్స్గా తీర్చిదిద్దే ఆత్మనిర్భర్ వ్యవసాయం దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కువ పాలు, పప్పుధాన్యాలు, అరటి, మామిడి, బొప్పాయి సహా వివిధ పంటల ఉత్పత్తి సాగుదారులుగా భారత్ ఉందన్నారు. బియ్యం, గోదుమ, చెరకు, వేరుశనగ, కూరగాయలు, పండ్లు, పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు.
2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా
అదే సమయంలో మనముందు పలు సవాళ్లు ఉన్నాయని, తగ్గుతున్న సాగు భూమి, పట్టణీకరణ, మితిమీరిన రసాయనీకరణ, వాతావరణ మార్పులు, నీటి లభ్యత, ఉత్పత్తి కొరత, సరఫరా గొలుసు ఆశించిన మేర లేకపోవడం, ప్రాసెసింగ్ సౌకర్యాల కొరత.. ఇలా ఎన్నో సమస్యలు తీర్చాల్సి ఉందన్నారు. దేశంలో 700కు పైగా జిల్లాలు ఉన్నాయని, 30 నుండి 40 లక్షల మధ్య జనాభాతో 40 గ్రామాలు, నగరాలు ఉండేలా క్లస్టర్స్ నిర్మించాలన్నారు. ఏదేమైనా 2030 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.