భారీగా పెరుగుతున్న బంగారం ధర, త్వరలో రూ.50,000 మార్క్
బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. గత మూడు రోజుల పాటు పెరిగిన ధరలు ఈ రోజు కాస్త దిగి వచ్చాయి. ఎంసీఎక్స్లో పసిడి 10 గ్రాములకు 0.55 శాతం పడిపోయి రూ.43,330గా ఉంది. వెండి ధర 0.6 శాతం తగ్గి రూ.46,402గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.1 శాతం తగ్గి ఔన్స్ 1,637.80 డాలర్ల వద్ద, వెండి 0.3 శాతం తగ్గి ఔన్స్ 17.22 డాలర్ల వద్ద ఉంది. ప్లాటినమ్ 872.40 డాలర్లుగా ఉంది.
బుధవారం బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. మేలిమి బంగారం 10 గ్రాములు రూ.45,000 చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లు ధరలు పెరగడానికి తోడు డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ఒక్కరోజే రూ.1200 నుండి రూ.1500 వరకు పెరిగి రూ.44,700కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.41,000కు చేరింది.
కాగా, బంగారం ధరలు రూ.50,000 మార్క్ చేరుకునే అవకాశాలు త్వరలోనే ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.