బంగారం, వెండి ఈ వారం ఎలా ఉండవచ్చు? ఈక్విటీపై ఆ ప్రభావం
బంగారం ధరలపై, ఈక్విటీ మార్కెట్లపై ఈ వారం అమెరికా బాండ్స్, ఫెడ్ రిజర్వ్ సమావేశం ప్రభావం పడనుంది. చమురు ధరలు కూడా ఈ వారం కీలకం కానున్నాయి. శివరాత్రి పర్వదినం కారణంగా ఈ వారంలో గురువారం మార్కెట్లకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులకు పరిమితమవుతుంది. గత వారం పసిడి ధరలు క్షీణించాయి. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్లు జంప్ చేశాయి. ఈ వారం ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంకు బలహీనంగా ఉండే అవకాశముంది.
NPS నుండి పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు: ఎంత, ఎలా, ఎన్నిసార్లు?
బంగారం ఫ్యూచర్
గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్ ఈవారం రూ.45,000 ఎగువన ట్రేడ్ కాకుంటే రూ.43,860 దిగువకు పడిపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ స్థాయి వద్ద నిలబడకుంటే మరింత దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు కొట్టి పారవేయలేమని అంచనా వేస్తున్నారు. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67,740 స్థాయిని అధిగమిస్తే రూ.68,700 వరకు పెరగవచ్చునని చెబుతున్నారు. ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉంటే మాత్రం పసిడికి సానుకూలంగా ఉండవచ్చునని అంటున్నారు.
గతవారం పసిడి, వెండి డౌన్
చివరి సెషన్లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.99 పెరిగి రూ.44,640 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.77 పెరిగి రూ.44,813 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం రూ.204 తగ్గి రూ.65,717 వద్ద, జూలై ఫ్యూచర్ రూ.164 క్షీణించి రూ.66,800 వద్ద క్లోజ్ అయింది. అయితే గతవారం మొత్తంగా పసిడి, వెండి ధరలు తగ్గాయి.
సిమెంట్ కంపెనీల షేర్లు సానుకూలం
ఈ వారం సిమెంట్ కంపెనీల షేర్లు సానుకూలంగా కదిలే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ధరలు పెరిగిన ప్రభావం కనిపించవచ్చు. స్పెక్ట్రం వేలం పూర్తయిన నేపథ్యంలో టెల్కోల మధ్య మళ్లీ పోటీ ఉండే అవకాశం ఉంది. ఐటీ కంపెనీలు కూడా సానుకూలంగా కదలాడవచ్చు. ఫార్మా స్టాక్స్ స్థిరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మెటల్ షేర్లు తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.