భారీగా తగ్గిన బంగారం దిగుమతులు, పడిపోయిన వజ్రాభరణాల ఎగుమతులు
2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. ఏడాది ప్రాతిపదికన జూన్ నెలలోను 86 శాతం వరకు పడిపోయాయి. ఏప్రిల్ - మే నెలల్లో పసిడి దిగుమతులు 79.14 మిలియన్ డాలర్లు (రూ.600 కోట్లకు పరిమితమయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో దిగుమతులు 8.75 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా సమయంలో డిమాండ్ మందగించడంతో ప్రభావం పడింది.
నేడు తగ్గిన బంగారం ధర: అలా అయితే వేగంగా పెరిగే ఛాన్స్!
డిసెంబర్ నుండి తగ్గుదల
బంగారం దిగుమతులు తగ్గడంతో ఏప్రిల్, మే నెలల్లో దేశ వాణిజ్య లోటు 9.91 బిలియన్ డాలర్లకు దిగి వచ్చింది. ఏడాదిక్రితం ఇది 30.7 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరి - మార్చి క్వార్టర్లో కరెంట్ ఖాతా లోటు కూడా అదుపులోకి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ నుండి పసిడి దిగుమతులు వరుసగా తగ్గుతున్నాయి. మార్చిలో 62.6 శాతం, ఏప్రిల్లో 99.93 శాతం, మే నెలలో 98.4 శాతం తగ్గాయి.
వజ్రాల ఎగుమతులు తగ్గాయి
ఇండియా ప్రతి సంవత్సరం దాదాపు 800 టన్నుల నుండి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇక, ఏప్రిల్ - మే నెలలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 82.46 శాతం మేర తగ్గి 1.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. వెండి దిగుమతులు 30.7 శాతం తగ్గి 437.89 మిలియన్ డాలర్లకు పడిపోయాయి.
జూన్ నెలలోను తగ్గిన పసిడి దిగుమతులు
బంగారం దిగుమతులు జూన్ నెలలో కూడా 86 శాతం తగ్గాయి. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు లాక్ డౌన్, అధిక ధరలు, దుకాణాల మూత వంటి వివిధ కారణాలతో భారీగా తగ్గాయి. అయితే అంతకుముందు ఏప్రిల్, మే కంటే కొద్దిగా పెరిగింది. జూన్ నెలలో 11 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. ఏడాది క్రితం ఇదే నెలలో 77.73 టన్నుల బంగారం దిగుమతి అయింది. వ్యాల్యూపరంగా జూన్ దిగుమతులు 2.7 బిలియన్ డాలర్ల నుండి 608.76 మిలియన్ డాలర్లకు తగ్గాయి.