94% తగ్గిన బంగారం దిగుమతులు, భారీగా దిగివచ్చిన వాణిజ్యలోటు
కరెంట్ అకౌంట్ లోటు(CAD)పై ప్రభావం చూపే బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో భారీగా తగ్గాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2019-20 ఇదే క్వార్టర్లో పసిడి దిగుమతులు 11.5 బిలియన్ డాలర్లు (రూ.86,250 కోట్లు)గా ఉండగా, ఈశారి 688 మిలియన్ డాలర్లకు (రూ.5,160 కోట్లు) పడిపోయింది. ఏకంగా 94 శాతం దిగుమతులు తగ్గాయని ఈ నివేదిక తెలియజేస్తోంది.
3 కంపెనీలు రూ.1 లక్ష కోట్లు ప్లస్, 7 కంపెనీలు రూ.37వేల కోట్లు లాస్
పసిడి దిగుమతులు అందుకే తగ్గాయి..
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ మొదటి క్వార్టర్లో పసిడి దిగుమతులు భారీగా అదుపులోకి వచ్చాయి. ఇదే సమయంలో వెండి దిగుమతులు కూడా 45 శాతం తగ్గి 57.50 కోట్ల డాలర్ల (సుమారు రూ.4,300 కోట్లు)కు పరిమితమయ్యాయి. కరోనా సంక్షోభానికి తోడు, ధరలు బాగా పెరగడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పసిడి ధరలు రూ.40వేలకు కాస్త అటు ఇటుగా ఉండగా, ఈ ఆరు నెలల కాలంలో ఏకంగా రూ.11వేలకు పైగా పెరిగి, రూ.51వేలకు చేరుకుంది. ఈ కారణంగా కూడా సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి దూరం జరుగుతున్నారు.
భారీగా తగ్గిన వాణిజ్య లోటు
బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గిపోవడంతో భారత వాణిజ్య లోటు ఏప్రిల్ - జూన్ నెలలో 912 కోట్ల డాలర్లు (రూ.68,400 కోట్లు)కు పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే కాలంలో వాణిజ్య లోటు 4,596 కోట్ల డాలర్లు (రూ.3,44,700 కోట్లు)గా ఉంది. సాధారణంగా భారత్ ప్రతి సంవత్సరం 800 టన్నుల నుండి 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఏప్రిల్ - జూన్ కాలంలో వజ్రాభరణాల ఎగుమతులు 72 శాతం క్షీణించి 270 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.
క్రమంగా పడిపోతున్న దిగుమతులు
వాణిజ్య లోటు తగ్గడంతో జనవరి-మార్చి కాలంతో పోలిస్తే ఇండియా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 0.1 శాతం నమోదయింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే వాణిజ్య లోటు 4.6 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 0.7 శాతం తగ్గింది. గత ఏడాది డిసెంబర్ నుండి బంగారం దిగుమతులు క్రమంగా పడిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దిగుమతులు వరుసగా 62.6 శాతం, 99.93 శాతం, 98.4 శాతం, 77.5 శాతం తగ్గాయి.