నేటి నుండే సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం సబ్స్క్రిప్షన్, అలా కొంటే రూ.50 తక్కువ
సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 సిరీస్ 1 స్కీం సబ్స్క్రిప్షన్ సోమవారం ప్రారంభమైంది. తొలి విడత గోల్డ్ బాండ్స్ మే 21వ తేదీన ముగియనుంది. ప్రభుత్వం గోల్డ్ బాండ్ ధరను (ఒక గ్రాముకు) రూ.4,777గా నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. నేటి నుండి (సోమవారం, మే 17) ఐదు రోజుల పాటు సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం ఇష్యూ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇష్యూలో గ్రాము బంగారం ధర రూ.4,777గా నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది.
రూ.50 తక్కువ
మే 2021 నుండి 2021 సెప్టెంబర్ వరకు ఆరు విడతలలో బాండ్స్ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్స్క్రిప్షన్ కాలానికి ముందు వారంలోని చివరి మూడు వర్కింగ్ డేస్ 999 స్వచ్ఛత బంగారం సగటు ధర ఆధారంగా బాండ్ వ్యాల్యు 1 గ్రాము బంగారానికి రూ.4777ని నిర్ణయించింది.
ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకునే సావరీన్ గోల్డ్ బాండ్స్ వ్యాల్యూ కంటే గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంటుంది. అంటే పది గ్రాములకు రూ.500 తక్కువగా ఉంటుంది. ఇటువంటి పెట్టుబడిదారులకు గోల్డ్ బాండ్ ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 4,727గా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
మే 25 బాండ్ జారీ
సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 సిరీస్ నేటి నుండి నుండి 2021 మే 21 వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మే 25న బాండ్స్ జారీ చేస్తారు. ఈ బాండ్స్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్స్ మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎంపిక చేయబడిన పోస్టాఫీస్లు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు, NSE, BSE ద్వారా విక్రయించబడతాయి.
పన్ను
సార్వభౌమ్ బంగారంబాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు.
పెట్టుబడిదారులను భౌతిక బంగారు పెట్టుబడుల నుండి బాండ్స్ వైపు ప్రోత్సహించేందుకు అందించే ప్రత్యేక ఆదాయ పన్ను ప్రయోజనం. మూలధన లాభాల పన్ను నుంచి పన్ను మినహాయింపు గోల్డ్ ఈటీఎప్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో లేదు. బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు కాగా ముందే నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి.
లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. కనీసం ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు వంటివి అయితే 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు.