ఏప్రిల్ 15 రోజుల్లో 50% తగ్గిన చమురు డిమాండ్, పెరిగిన సిలిండర్ సేల్స్
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డొన్ కొనసాగుతోంది. దీంతో వాహనాలు రోడ్ల పైకి రావడం తగ్గిపోవడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఏప్రిల్ నెల తొలి రెండు వారాల్లో సాధారణం కంటే 50% తక్కువ ఇంధన అమ్మకాలు జరిగాయని పెట్రోల్ బంకుల రిటెయిలర్స్ చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభమే, వాటిపైనే ఆధారం, ఎప్పుడు కోలుకుంటామంటే: IMF
జెట్ ఫ్యూయల్ అయితే 94 శాతం తగ్గుదల
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కంపెనీల వాటా భారత రిటైల్ ఫ్యూయల్ ఔట్లెట్లలో 90 శాతం ఉంటుంది. ఏప్రిల్ మొదటి 15 రోజుల్లో గ్యాసాయిల్ సేల్స్ ఏకంగా 61% తగ్గాయి. గ్యాసోలిన్ 64%, జెట్ ఫ్యూయెల్ 94% తగ్గుదలను నమోదు చేసింది.
ఎల్పీజీ డిమాండ్ పెరిగింది
ఇండియాలో శుద్ధి చేసిన ఇంధన డిమాండ్లో ఫ్యూయల్ ఆయిల్, బిటుమెన్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ఉన్నాయి. ఎల్పీజీ గ్యాస్ మాత్రం ఎక్కువగా సేల్ అయింది. ఏప్రిల్ మొదటి పదిహేను రోజుల్లో 21 శాతం ఎల్పీజీ సేల్స్ పెరిగాయి. లాక్ డౌన్ నేపథ్యంలో మూడు నెలల పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
అంచనా రివర్స్
లాక్ డౌన్ను కేంద్రం మే 3వ తేదీ వరకు పొడిగించింది. కరోనా హాట్ స్పాట్ లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20వ తేదీ నుండి కాస్త వెసులుబాటు కల్పించనున్నారు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ప్రకారం ఇండియా వార్షిక చమురు వినియోగం 2020లో 5.6 శాతం తగ్గనుంది. అంతకుముందు 2.4 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. గ్యాసోలిన్ 9 శాతం, డీజిల్ 6.1 శాతం తగ్గుతుందని అంచనా వేసింది.