ఒక్క భారత్లోకి మాత్రమే వస్తున్నాయి.. ఆసియా దేశాల నుండి FPIs వెనక్కి
మార్చి నెలలో భారత మార్కెట్లోకి ఫారెన్ పోర్ట్పోలియో ఇన్వెస్టర్స్(FPI)లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.8,642 కోట్ల FPIలు వచ్చాయి. డిపాజిటరీస్ డేటా ప్రకారం 14,202 కోట్ల FPIలు ఈక్విటీస్లోకి వచ్చాయి. అదే సమయంలో డెట్ సెగ్మెంట్ నుండి రూ.5,560 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఇది మార్చి 1వ తేదీ నుండి 19వ తేదీ మధ్య డేటా. మొత్తం నికర పెట్టుబడులు రూ.8,642 కోట్లుగా ఉన్నాయి. జనవరి నెలలో FPIs ద్వారా రూ.14,649 కోట్ల నికర పెట్టుబడులు, ఫిబ్రవరిలో రూ.23,663 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి.
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్
కొంతకాలం పాటు జాగ్రత్త అనంతరం, ఈ వారం మార్కెట్లో అస్థిరత, కరెక్షన్ ఆ పెట్టుబడులను తిరిగి ఈక్విటీలలోకి తీసుకు వచ్చాయని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్-అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాత్సవ అన్నారు. మరోవైపు, అమెరికా 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో ప్రపంచ ఆర్థిక మార్కెట్లోకి లిక్విడిటీ పెరిగింది. ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి ఆస్తులు, లిక్విడిటీ ప్రవహించేలా చేస్తోందని చెబుతున్నారు.
భారత్ మినహా మిగతా దేశాల్లో వెనక్కి
దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా స్టాక్ మార్కెట్లు ఇటీవల ఒడుదొడుకుల్లో ఉన్నాయి. దీంతో తొలుత వెనక్కి తగ్గిన ఇన్వెస్టర్లు మార్కెట్లు స్థిరీకరణ దిశగా సాగుతుండడంతో తిరిగి పెట్టుబడులను భారత్ వైపు మళ్లిస్తున్నారు. దీనికి అమెరికా ఉద్దీపన ప్యాకేజీ తోడయింది. కరోనా వ్యాక్సీన్ కూడా దోహదపడింది. ఆసియాలో ఒక్క భారత్ మినహా మిగతా అన్ని దేశాల నుంచి FPIలు భారీ ఎత్తున వెనక్కి వెళ్తున్నాయి.
ద్రవ్యోల్భణ భయాలు
అమెరికాలో బాండ్ యీల్డ్స్ పెరిగిన తర్వాత FPI ప్రవాహం అస్థిరంగా మారాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భణ భయాలతో మార్కెట్లు జాగ్రత్తగా ఉన్నాయి. FPIలు వెనక్కి తరలిన దేశాల్లో తైవాన్ ముందు ఉంది. మార్చి నెలలో ఇప్పటి వరకు తైవాన్ నుండి 4.5 బిలియన్ డాలర్లు వెనక్కి వెళ్లాయి. ఈ క్యాలెండర్ ఏడాదిలో దక్షిణ కొరియా, తైవాన్ నుండి వరుసగా 11 బిలియన్ డాలర్లు, 7 బిలియన్ డాలర్లు వెనక్కి వెళ్లాయి. కేవలం ఇండియాలోకి మాత్రమే తరలి వస్తున్నాయి.