సౌదీ ఆరామ్కో టార్గెట్గా మిసైల్ అటాక్, భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది కాలంగా భారీగా క్షీణించిన చమురు ధరలు క్రమంగా పుంజుకొని, పాతస్థాయికి చేరుకున్నాయి. క్రూడ్ ధరలు ఓ సమయంలో బ్యారెల్ 20 డాలర్లకు చేరుకుంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడంతో 2020 ఏప్రిల్ నెల నుండి చమురు ధరలు దారుణంగా పతనమయ్యాయి. గత కొద్ది నెలలుగా అంతర్జాతీయంగా రికవరీ పుంజుకుంటుండటంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఓపెక్ దేశాలు సహా చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో కోత విధించడం కూడా ధరలు పెరగడానికి దోహదపడుతోంది.
NPS నుండి పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు: ఎంత, ఎలా, ఎన్నిసార్లు?
మిసైల్ అటాక్
బ్రెంట్ క్రూడాయిల్ ధర సోమవారం రెండు శాతానికి పైగా పెరిగింది. ఒక్కసారిగా ఇంతగా పెరగడానికి మరో కారణం కూడా ఉంది. సౌదీ ఆరామ్కో ఫెసిలిటీ పైన మిసైల్ అటాక్ జరగడంతో ధరలు హఠాత్తుగా పెరిగాయి. ఈస్టర్న్ సౌద పోర్ట్ వద్ద డ్రోన్లు కదలాడాయి. ఇవి ఆరామ్కో ఫెసిలిటీ కేంద్రాలను టార్గెట్ చేశాయి. దీంతో ధరలు ఎగిసిపడ్డాయి. రాస్ తనురా పోర్ట్, ఆరామ్కో రెసిడెన్షియల్ ప్రాంతంలో అటాక్స్ జరిగినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.
భారీగా పెరిగిన ధర
చమురును బ్లాక్ గోల్డ్గా పేర్కొంటారు. ఇది బ్యారెల్ ధర నేడు 2.11 శాతం ఎగిసి 70.82 డాలర్లకు చేరుకుంది. మే 2019 తర్వాత ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. గత పద్దెనిమిది నెలల కాలంలో బ్యారెల్ ధర ఇంతలా పెరగడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ ధర 2.56 శాతం కూడా ఎగిసి బ్యారెల్కు 71.20 డాలర్ల వరకు కూడా వెళ్లింది. క్రూడ్ ఫ్యూచర్స్ 2.56 శాతం పెరిగి 67.78 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
సౌదీ లక్ష్యంగా మాత్రమే కాదు
ప్రపంచ అతిపెద్ద ఆయిల్ షిప్పింగ్ పోర్ట్ పెట్రోలియం ట్యాంక్ కంపెనీపై దాడి జరిగిందని సౌదీ అరేబియా ఎనర్జీ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. డ్రోన్, బాలిస్టిక్ మిసైల్ ద్వారా టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి విధ్వంసకర చర్యలు కేవలం సౌదీ అరేబియా లక్ష్యంగా మాత్రమే కాదని, ప్రపంచ ఇంధన సరఫరా భద్రత, స్థిరత్వానికి దెబ్బ అని, తత్ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని సౌదీ ఎనర్జీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.