ఎవర్ గ్రాండ్లో మెజార్టీ వాటా విక్రయం, ఎవరికంటే? ట్రేడింగ్ నిలిపివేత
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎవర్ గ్రాండ్లో వాటా కొనుగోలు చేసేందుకు మరో బిలియనీర్ ముందుకు వచ్చారు. హాంగ్కాంగ్ లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ హాప్సన్ డెవలప్మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. హాప్సన్ను చూ ఫ్యామిలీకి చెందిన సంస్థ. ఇటీవల ఎవర్ గ్రాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎవర్ గ్రాండ్ సంస్థ రుణదాతలకు చెల్లింపుల కోసం తన ప్రాపర్టీ మేనేజ్మెంట్ వ్యాపారంలో మెజార్టీ వాటాను విక్రయించేందుకు ముందుకు వచ్చింది. ఎవర్ గ్రాండ్ ప్రాపర్టీ సర్వీసెస్ గ్రూప్లోని 51 శాతం వాటాను ఎవర్ గ్రాండ్ విక్రయించనుందని చైనా మీడియా తెలిపింది. చైనా ప్రభుత్వం మద్దతు కలిగిన హాప్సన్ ఈ వాటాను సొంతం చేసుకునేందుకు 5 బిలియన్ డాలర్లు చెల్లించనుందని తెలుస్తోంది. ఎవర్ గ్రాండ్, దాని బిలియనీర్ వ్యవస్థాపకుడు హుయ్-కా-యాన్ కోసం ఫైనాన్స్ చేస్తున్న మరో సంపన్న కుటుంబం ఛూ ఫ్యామిలీ అవుతుంది.
ఇదిలా ఉండగా, హాంగ్కాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో ఎవర్ గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ సోమవారం నిలిచింది. ఎవర్ గ్రాండ్ ప్రాపర్టీ గ్రూప్ షేర్ల ట్రేడింగ్ కూడా ఆగిపోయింది. కంపెనీ షేర్లకు సంబంధించిన అతిపెద్ద ట్రాన్సాక్షన్ ప్రకటన నేపథ్యంలో ట్రేడింగ్ నిలిపివేయాలని తాము కోరినట్లు కంపెనీ తెలిపింది. కానీ ట్రాన్సాక్షన్ ఏమిటనే అంశాన్ని వెల్లడించలేదు. అలాగే, హాప్సన్ కూడా ట్రేడింగ్ నిలిపివేయాలని హాంగ్కాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీని కోరిందని సమాచారం. వాటా కొనుగోలు నిమిత్తమే దీనిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.
చైనా అతిపెద్ద రియాల్టీ కంపెనీ ఎవర్ గ్రాండ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే 300 బిలియన్ డాలర్లను రుణదాతలకు ఆ కంపెనీ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం వీటిపై వడ్డీ చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో గతవారం కంపెనీకి షేర్లను ఓ చైనా బ్యాంకులో తాకట్టు పెట్టి 1.5 బిలియన్ డాలర్ల రుణానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. బాండ్ కొనుగోలు చేసిన వారికి ఈ సొమ్ముతో వడ్డీ చెల్లించాలని భావిస్తోంది.