రాబడి తగ్గినా పర్లేదు: ఆదాయపు పన్నుపై మోడీ ప్రభుత్వం అందుకే ఇలా...!
ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు కేంద్రం వివిధ రకాల ఉద్దీపన చర్యలు తీసుకుంది. ఆయా రంగాలకు వేల కోట్లు ప్రకటించడం, కార్పోరేట్ ట్యాక్స్ వంటివి తగ్గించడం చేసింది. మందగమనం నేపథ్యంలో వచ్చే బడ్జెట్లోను ఆదాయపు పన్ను, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, ఎక్సైజ్, కస్టమ్ సుంకాలపై పరిశ్రమ, వాణిజ్య సంఘాల నుంచి సూచనలు కోరుతోంది. వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది.
ఆదాయపు పన్ను రేట్లు తగ్గే ఛాన్స్: ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో కోత?
తగ్గుతున్న జీడీపీ
డిమాండ్ తగ్గడంతో జూన్తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ రేటు ఆరేళ్ల కనిష్ఠానికి (5 శాతం) పడిపోయింది. ఈ క్వార్టర్లోను మరింత తగ్గుతుందని (4.2%) అంచనా ఉంది. ఈ ఏడాది జీడీపీ ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వచ్చే ఏడాది మెరుగుపడుతుందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి. ప్రస్తుత మందగమన పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఉద్దీపన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్యాక్స్ అంశాలను కూడా పరిశీలిస్తోంది.
ట్యాక్స్ తగ్గింపులు...
కంపెనీల ఆదాయ పన్ను చెల్లింపు భారంపై ఊరట కల్పించారు. ఎన్బీఎఫ్సీ, రియల్టీ రంగాలను ఆదుకునేందుకు ప్రత్యేక సహాయక ప్యాకేజీ ప్రకటించారు. ఉద్దీపన ప్రభావాలు మెల్లిగా కనిపిస్తున్నాయి. మరింత ఊతమిచ్చేందుకు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారం మరింత తగ్గించి ప్రజలు, కంపెనీల వినిమయ ఆదాయం మరింత పెంచితే తప్ప డిమాండ్ ఊపందుకునే అవకాశం లేదని భావిస్తోంది.
నోటిఫికేషన్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వివిధ రంగాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు. ఇప్పుడు ఎక్సైజ్, దిగుమతి సుంకాలు, వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయ పన్ను రేట్లలో చేయాల్సిన మార్పులపై పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు తెలపాలని ఏకంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పరిశ్రమ, వాణిజ్యవర్గాల అభిప్రాయాలు, సూచనల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం బహుశా ఇదే మొదటిసారి అంటున్నారు.
రాబడి తగ్గినా...
ప్రభుత్వ ఆదాయ మార్గాలను కొంత వదులుకున్నప్పటికీ జీడీపీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ సర్కార్ ముందుకెళ్తోందని చెబుతున్నారు. జీఎస్టీ అమలుతో ప్రభుత్వ ఖజానాకు రాబడి తగ్గింది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న స్తబ్ధతను పారద్రోలేందుకు ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. ఇటీవల ఏర్పాటైన కొత్త ఉత్పాదక రంగ సంస్థలకు 15% కార్పొరేట్ ట్యాక్స్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల నష్టం. ఇప్పుడు ఐటీ, ఎక్సైజ్, కస్టమ్ సుంకాల తగ్గింపుకు కూడా సిద్ధమవుతోంది.