గోల్డ్ లోన్ స్టార్టప్లో ఫ్లిప్కార్ట్ ఫౌండర్ బిన్నీ బన్సాల్ పెట్టుబడి
ఇండియాలో గోల్డ్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇది కేవలం మహిళలకు సంబంధించిన ఆభరణాలకు పరిమితం కాలేదు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ బంగారమంటే మక్కువే. అందుకే ప్రతి ఒక్కరి చేతికి కనీసం ఒక రింగు, లేదా మెడలో ఒక బంగారు గొలుసు ఉండటం సర్వ సాధారణం. మరికొందరైతే ఎంత ఎక్కువ బంగారాన్ని ఒంటిపై వేసుకుని ప్రదర్శిస్తే... అంత సంపన్నులని భావిస్తారు. తరతరాలుగా వస్తున్నఈ ఆచారం... మొబైల్ వరల్డ్ లోనూ తగ్గటం లేదు సరికదా మరింతగా పెరిగిపోతోంది. అందుకే బంగారం ఆధారంగా మన దేశంలో అనేక వ్యాపారాలు సాగుతుంటాయి.
బంగారం ఒక సురక్షితమైన, వెంటనే పనికొచ్చే నగదు లభ్యత కలిగిన ఒక ద్రవ్య సాధనం. అందుకే, ఎవరకి ఎలాంటి సమయంలో ఋణం కావాలన్నా... బంగారాన్ని తనఖా పెడితే ఇట్టే లోన్ మంజూరు అవుతుంది. బ్యాంకులు, మార్వాడి పాన్ బ్రోకర్లు, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం వంటి బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు అన్నీ గోల్డ్ లోన్స్ ఇస్తాయి. ముత్తూట్, మణప్పురం అయితే మరీ 1 నిమిషంలో గోల్డ్ లోన్ అని వినియోగదారులను ఊరిస్తాయి. ఇంత డిమాండ్ ఉంది కాబట్టే.. గోల్డ్ లోన్స్ ఆన్లైన్ లో అందజేసే ఒక స్టార్టుప్ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. రుపీక్ అనే ఈ స్టార్టుప్ కంపెనీ ఈ రంగంలో దూసుకుపోతోంది.
ఆదాయపు పన్ను స్లాబ్లో కన్ఫ్యూజనా?: ఈ-కాలిక్యులేటర్తో
30 మిలియన్ డాలర్ల నిధులు...
2016 లో ప్రారంభమైన రుపీక్... అతి తక్కువ డాక్యుమెంటేషన్ తో ఆన్లైన్ లో సులభంగా బంగారు రుణాలు మంజూరు చేస్తోంది. అందుకే ఈ స్టార్టుప్ కంపెనీపై పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల దృష్టి పడింది. ఇప్పటికే ఇది సుమారు 30 మిలియన్ డాలర్ల పెట్టుబడిని రాబట్టగా ... తాజాగా ఫ్లిప్కార్ట్ కో-ఫౌండర్ బిన్నీ బన్సాల్ సహా మరో ఇద్దరు ఇన్వెస్టర్లు సంయుక్తంగా మరో 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ 210 కోట్లు ) నిధులను అందించారు. జీజీవీ కాపిటల్, కొరియా కు చెందిన కెబి ఇన్వెస్ట్మెంట్స్ అనే రెండు సంస్థలు కూడా ఈ పెట్టుబడి రౌండ్లో పాల్గొన్నాయి. ఈ మేరకు ఎంట్రాకర్ ఒక కథనం ప్రచురించింది. ఇప్పటికే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సేకోయ కాపిటల్, ఆక్సెల్ పార్టనర్స్, బెర్టల్స్ మాన్ అనే సంస్థలు కూడా ప్రస్తుత పెట్టుబడిని సమకూర్చాయి.
రూ 500 కోట్లు...
ప్రారంభించి కేవలం నాలుగేళ్లకు అయినా గడవక ముందే రుపీక్ పెద్ద ఎత్తున ఇన్వెస్టర్ల నుంచి ప్రైవేట్ ఈక్విటీ ని సమీకరిస్తోంది. తాజాగా బిన్నీ బన్సాల్ ఇన్వెస్ట్మెంట్ తో కలిసి మొత్తంగా ఈ స్టార్టుప్ కంపెనీ ఇప్పటి వరకు 72 మిలియన్ డాలర్లు (సుమారు రూ 500 కోట్లు) పెట్టుబడిని సమీకరించటం విశేషం. బంగారం స్వచ్చత ని పరీక్షించేందుకు రుపీక్... ప్రత్యేకమైన హార్డ్ వేర్ ను ఉపయోగిస్తోంది. సోషల్ మీడియా వేదికగా మార్కెటింగ్ చేస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తోంది. పూర్తిగా డిజిటల్ వేదికల ఆధారంగా మార్కెట్ చేసుకుంటూ, వేగంగా రుణ మంజూరు చేయగలగడం రుపీక్ ప్రత్యేకత అని చెబుతున్నారు.
రూ 1,000 కోట్ల రుణాల మంజూరు...
ఇంటి వద్దే రుణాలు మంజూరు చేస్తానని ప్రకటిస్తున్న రుపీక్... ప్రతి రూ లక్ష బంగారు రుణంపై రూ 12,377 వరకు వడ్డీ ఆదా చేసుకోవచ్చని పేర్కొంటోంది. అలాగే గోల్డ్ లోన్స్ ను 0.89% వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు ఇండియా లో రూ 1,000 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్లు రుపీక్ ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,000 ప్రాంతాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. రుపీక్ రుణాల జోరు, పెట్టుబడుల హోరు చూస్తుంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టుప్ కంపెనీ త్వరలోనే యునికార్న్ లిస్ట్ లో చేరిపోయేలా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.