రూ.700 కోట్లు చెల్లించాల్సిందే: అనిల్ అంబానీకి బ్రిటన్ కోర్టు భారీ షాక్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మూడు చైనా బ్యాంకులకు ఆరు వారాల్లోగా 100 మిలియన్ డాలర్లు చెల్లించాలని బ్రిటన్ కోర్టు షాకిచ్చింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.700 కోట్లు. రుణ ఒప్పందం కింద అనిల్ నుంచి 680 మిలియన్ డాలర్లు రికవరీ చేయాలని కోరుతూ చైనా బ్యాంకులు వేసిన పిటిషన్ను కోర్టు విచారించి, తీర్పు చెప్పింది.
అనిల్ అంబానీ 100 మిలియన్ డాలర్లు చెల్లించాలి
రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి సంబంధించి చైనా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గాను వ్యక్తిగత హామీ ఇచ్చిన ప్రమోటర్ అనిల్ అంబానీకి బ్రిటన్ హైకోర్టులో శుక్రవారం చుక్కెదురైంది. ఆరు వారాల్లో 100 మిలియన్ డాలర్లు కోర్టులో డిపాజిట్ చేయాలని జడ్జి ఆదేశించారు. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంకు ఆఫ్ చైనా ముంబై శాఖ, చైనా డెవలప్మెంట్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా... అనిల్పై దాఖలు చేసిన పిటిషన్లో కండిషనల్ ఆర్డర్లో భాగంగా ఆదేశాలు జారీ చేశారు.
అనిల్ ఆస్తులు సున్నా..
అంతకుముందు, అంబానీ తరఫున ఆయన లాయర్లు వాదించారు. అంబానీ నికర వ్యాల్యూ సున్నాగా మారిందని కోర్టుకు తెలిపారు. ఆయన కుటుంబం కూడా ఆదుకునే పరిస్థితి లేదని చెప్పారు. ఈ వాదనలను న్యాయమూర్తి డేవిడ్ వాక్స్మన్ తిరస్కరించారు. ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేస్తామని అనిల్ గ్రూప్ తెలిపింది.
2012 రుణంపై..
ఫిబ్రవరి 2012లో సుమారు 925మిలియన్ డాలర్ల బాకీ రీఫైనాన్సింగ్ లోన్పై వ్యక్తిగత హామీని అనిల్ ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ చైనా బ్యాంకులు UK హైకోర్టును సమ్మరీ జడ్జిమెంట్ కోరింది. ఈ రుణానికి సంబంధించి వ్యక్తిగత పూచీకత్తును పాటించలేదనే దానిపై దావా దాఖలైంది. అలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని అనిల్ ఖండించారు. ఈ కేసులో అనిల్ అంబానీకి బ్రిటన్ కోర్టు షాకిచ్చింది.