అమెజాన్ జెఫ్ బెజోస్కు షాకిచ్చేందుకు ఇండియన్ ట్రెడర్స్ రెడీ! కారణమిదే
అమెజాన్ డాట్ కామ్ ఇంక్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ త్వరలో భారత్ రానున్నారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది మంది స్మాల్ ట్రేడర్స్ నిరసన వ్యక్తం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జెఫ్ బెజోస్ కంపెనీ కార్యక్రమం కోసం వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులను కూడా కలవనున్నారు.
స్మాల్, మీడియం సైజ్ ఎంటర్ప్రెన్యూవర్స్ను ఏకం చేయాలనే లక్ష్యంతో ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో జెఫ్ బెజోస్ పాల్గొంటారు. అతను ప్రధాని నరేంద్ర మోడీతోను భేటీకి అపాయింటుమెంట్ తీసుకున్నారు. అలాగే ఇతర ప్రభుత్వ అధికారులతోను భేటీ కానున్నారు. ఆయన రాక నేపథ్యంలో ఈ-కామర్స్కు సంబంధించిన చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు.
జెఫ్ బెజోస్ విజిట్, అతను రానున్న తేదీ, భారత్లో ఎన్ని రోజులు ఉంటారనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే దాదాపు 70 మిలియన్ల ట్రేడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) జెఫ్ బెజోస్ భారత్కు వచ్చే రోజున దేశవ్యాప్తంగా 300 సిటీల్లో నిరసనలు చేపట్టాలని ప్లాన్ చేస్తోంది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్ సైట్స్ మొబైల్ ఫోన్స్ నుంచి కిరాణా ఐటమ్స్ వరకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో చిన్న వ్యాపారులు దెబ్బతింటున్నారు. అటు ఇటుగా 2015 నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటి ద్వారా CAIT ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విదేశీ ఈ-కామర్స్ వెబ్ సైట్లు విదేశీ పెట్టుబడుల నిబంధనలు ఉల్లంఘించి బిజినెస్ చేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆ కంపెనీలు ఖండిస్తున్నాయి.
తమ ఈ-కామర్స్ వెబ్ సైట్స్ చిన్న చిన్న అమ్మకందారులు, చేతివృత్తులు, చేనేత కార్మికులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నాయని వారు చెబుతున్నారు. కానీ CAIT దీంతో ఏకీభవించడం లేదు.
జెఫ్ బెజోస్ రాక నేపథ్యంలో తాము ఢిల్లీ, ముంబై, కోల్కతా సహా ఇతర పట్టణాలలో నిరసనలు చేపడతామని CAIT గ్రూప్ సెక్రటరీ ప్రవీన్ ఖండేవాలా తెలిపారు. దాదాపు లక్ష మంది ట్రేడర్స్ నిరసనలో పాల్గొంటారని తెలిపారు.