న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఇదివరకే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తు కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.
గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు సుమారు 10 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడ్డారంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టులో గతంలోనే విచారణకు స్వీకరించింది. సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు.

హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ పై దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దర్యాప్తు కమిటీని కూడా ప్రకటించింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రె సారథ్యాన్ని వహిస్తారు. ఈ కమిటీలో ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవదత్, ఎంవీ కామత్, నందన్ నీలకేని, సోమశేఖర్ సుందరేశన్ ఉన్నారు.
భవిష్యత్తులో ఆర్థిక మోసాలు జరగకుండా ఎలాంటి కట్టుదిట్టమైన నియమ నిబంధనలను రూపొందాల్సి ఉంటుందనే విషయంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోందీ కమిటీ. ఆర్థిక మోసాలు జరక్కుండా ఉండటానికి అవసరమైన సిఫారసులను సూచిస్తుంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికపై రెండు నెలల్లోగా సీల్డ్ కవర్ లో నివేదికను అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న సెబి రెగ్యులేటరీ మెకానిజాన్ని కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.
విచారణలో భాగంగా- సెబి ఇవ్వాళ సుప్రీంకోర్టుకు రిజాయిండర్ అఫిడవిట్ను దాఖలు చేసింది. 2016 నుంచీ గౌతమ్ అదాని సంస్థలపై తాను దర్యాప్తు సాగిస్తోన్నానంటూ వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చింది. తాము ఎలాంటి దర్యాప్తు కూడా జరపట్లేదని స్పష్టం చేసింది. ఈ దర్యాప్తు వార్తల్లో వాస్తవం లేదని, నిరాధారమైనవని పేర్కొంది. ఈ మేరకు సెబి తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు.
2016 నుంచి దర్యాప్తు జరుపుతోన్న సంస్థల్లో అదాని గ్రూప్స్కు చెందిన కంపెనీలేవీ లేవని తెలిపింది.అదాని-హిండెన్బర్గ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించడానికి సుప్రీంకోర్టు రెండు నెలల గడువు ఇచ్చిన నేపథ్యంలో- దీన్ని పొడిగించాలని కూడా సెబి కోరింది. 15 నెలల సమయం కావాల్సి ఉంటుందని, మార్కెట్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల గడువు ఇవ్వాలని తుషార్ మెహతా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications