బికినీ ఎయిర్ లైన్స్ బంపరాఫర్, రూ.9కే విమాన టిక్కెట్
న్యూఢిల్లీ: వియత్నాంకు చెందిన విట్జెట్ ఎయిర్ లైన్స్ భారత్లోకి ఎంట్రీ ఇస్తోంది. బికినీ ఎయిర్ లైన్స్గా దీనికి పేరు ఉంది. ఈ విమానయాన సేవలు ఇండియా - వియత్నాం మధ్య డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విట్జెట్ మంగళవారం ఓ ప్రకటన చేసింది. డిసెంబర్ 6వ తేదీన ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను రన్ చేస్తామని, హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7వ తేదీ నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలు రన్ చేస్తామని తెలిపింది.
రూ.9కే ఆఫర్
2011లో బికినీలలో సిబ్బందిని కలిగి ఉన్న ప్రకటనతో ఈ ఎయిర్ లైన్స్ బాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఎయిర్ లైన్స్ బంపరాఫర్ ప్రకటించింది. సూపర్ సేవింగ్ ఆఫర్ రూ.9 నుంచి టిక్కెట్ ధరను ఆఫర్ చేస్తోంది. ఆగస్ట్ 20 నుంచి 22వ తేదీ మధ్య 'త్రీ గోల్డెన్ డేస్-ఎ స్పెషల్ ప్రమోషన్'ను ప్రకటించింది. విస్తరిస్తున్న నెట్ వర్క్లో భారతదేశం తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా ఉందని ఎయిర్ లైన్స్ ఉపాధ్యక్షులు న్యూమెన్ తన్ సన్ తెలిపారు.
బికినీలు ధరిస్తారు..
ఈ ఎయిర్ లైన్స్లో కొంతమంది సిబ్బంది బికినీలు ధరిస్తారు. అంతేకాదు ఏటా విమానయాన సంస్థ విడుదల చేసే క్యాలెండర్లో కూడా విమానంలో పని చేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫోటోలే కనిపిస్తాయి. విట్జెట్ రోజుకు 400 విమానాలను ఆపరేట్ చేస్తోంది. 80 మిలియన్ల ప్రయాణీకులు రోజుకు ఈ ఎయిర్ లైన్స్లో ప్రయాణిస్తున్నారు. 129 మార్గాలను కవర్ చేస్తున్నాయి.
ఇప్పటికే ఇండిగో ప్రకటన
కాగా, హోచి మిన్ మార్గంలో సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు, హనోయి మార్గంలో మంగళ, గురు, శనివారాలు విమానాలను రన్ చేస్తారు. కాగా, కోల్కతా - హోచి మిన్ మధ్య అక్టోబర్ 3వ తేదీ నుంచి విమానాలు నడపనున్నట్లు ఇప్పటికే ఇండిగో ప్రకటించింది.