గుడ్న్యూస్: రూ.50,000 ట్రాన్సాక్షన్ దాటినా పాన్కార్డ్ బదులు ఆధార్కు ఓకే
న్యూఢిల్లీ: రూ.50వేలకు మించి నగదు లావాదేవీలకు ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చునని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే శనివారం స్పష్టం చేశారు. బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి ప్రకటన చేశారు. బడ్జెట్ నిర్ణయం ప్రకారం పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డును సమర్పించవచ్చని వెల్లడించారు.
చదవండి: బడ్జెట్ 2019: సంపన్నులపై సర్చార్జ్, వారందరికీ రాయితీలు

మోడీ ప్రభుత్వం ఇక్కడ పాన్ తప్పనిసరి చేసింది..
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డును అనుమతించాలని రెవెన్యూ కార్యదర్శి ఆదేశించారు. బ్లాక్ మనీని అరికట్టడంలో భాగంగా రూ.50వేలు దాటిన విదేశీ ప్రయాణ బిల్లులు లేదా హోటల్ ఖర్చుల వంటి వ్యయాలకు పాన్ కార్డును తప్పనిసరి చేశారు. అలాగే, రూ.10 లక్షలకు పైగా స్థిరాస్థి కొనుగోలుకు కూడా పాన్ కార్డు ఉండాలి. ఈ నేపథ్యంలో రూ.50 వేలకు మించి నగదు ఉపసంహరణ చేసి పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డును వివరాలు ఇవ్వవచ్చా.. అనే సందేహానికి రెవెన్యూ కార్యదర్శి వివరణ ఇచ్చారు.

రూ.50 వేలు మించితే ఆధార్ ఉపయోగించవచ్చు
రూ.50 వేలు దాటినప్పటికీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డు వివరాలు ఇవ్వవచ్చునని రెవెన్యూ కార్యదర్శి తెలిపారు. బ్యాంకులు, ఇతర సంస్థలు పాన్ తప్పనిసరి ఉన్న లావాదేవీలకు ఆధార్ కార్డును అనుమతించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటాయన్నారు. రూ.50 వేలకు మించి బ్యాంకులో జమ చేసినా, విత్ డ్రా చేసినా ఉపయోగించవచ్చా అని ప్రశ్నించగా.. అవును, అలాంటి సమయాల్లోను ఆధార్ వినియోగించవచ్చునని ఆయన తెలిపారు. కొంతమంది పాన్ కార్డును ఉపయోగించడాన్ని సౌకర్యంగా భావిస్తారని, ఆ రెండింట్లో ఏదైనా ఉపయోగించవచ్చునని చెప్పారు.

ప్రతి పాన్ కార్డుకు ఆధార్ ఉంటుంది.. కాబట్టి
ప్రతి పాన్ కార్డుకు ఆధార్ కార్డు ఉంటుందని చెప్పారు. ఎవరికైనా పాన్ కార్డు కావాలంటే ముందు ఆధార్ కార్డు ఉపయోగించవలసి ఉంటుందన్నారు. అప్పుడే పాన్ జనరేట్ అవుతుందన్నారు. ఆ తర్వాత దానిని వినియోగించుకోవచ్చునని చెప్పారు. పాన్ స్థానంలో ఆధార్ వినియోగించే అవకాశం కల్పిస్తున్నప్పటికీ, పాన్ కార్డును తొలగించే యోచన లేదని స్పష్టం చేశారు. ఈ రెండు ఉంటాయన్నారు. ప్రజలు ఏదైనా వినియోగించవచ్చునని చెప్పారు. ప్రస్తుతం 120 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉండగా, 22 కోట్లు పాన్ కార్డులు లింక్ అయినట్లు చెప్పారు. దేశంలో 41 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి.

కొత్తగా 1.30 కోట్ల పన్ను చెల్లింపుదారులు
కాగా, కొత్తగా ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య పెంచాలని ఆదాయ పన్ను శాఖకు సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.30 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులను జత చేయాలని లక్ష్యం నిర్దేశించింది. కొత్త పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఇచ్చిన లక్ష్యం ఏపీ, తెలంగాణలో 9,22,465గా ఉంది. 2018-19లో దాదాపు 1.10 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులు జతయ్యారు.


Click it and Unblock the Notifications