అత్తెసరు లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్
తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు అతి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. మూడో రోజు కూడా అతికష్టం మీద స్వల్ప లాభాలను నిలబెట్టుకున్న నిఫ్టీ, సెన్సెక్స్లు ఆద్యంతం లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడాయి. 50 పాయింట్ల రేంజ్లో కదలాడినప్పటికీ చివరకు ఫ్లాట్ క్లోజింగ్ నమోదైంది. 11932 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ ఒక దశలో నీరసించి 11887 వరకూ వెళ్లింది. ఆఖర్లో మళ్లీ కోలుకుని చివరకు 6 పాయింట్ల లాభంతో 11916 దగ్గర ముగిసింది. అటువైపు సెన్సెక్స్ కూడా 23 పాయింట్లు పెరిగి 39,839 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 99 పాయింట్లు ఎగసి 31,382 దగ్గర స్థిరపడింది.
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఈ రోజు అర శాతం వరకూ పెరిగాయి. ఇక సెక్టోరల్ సూచీల పరంగా చూస్తే ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా రంగ సూచీల్లో కొద్దిగా అమ్మకాల ఒత్తిడి నమోదైంది. పీఎస్యూ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రియాల్టీ, ఎఫ్ఎంసిజి, బ్యాంకింగ్, మీడియా రంగ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు కనిపించింది.

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, జీ ఎంటర్టైన్మెంట్, గ్రాసిం స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. ఐషర్ మోటార్స్, గెయిల్, టెక్ మహీంద్రా, వేదాంతా, డాక్టర్ రెడ్డీస్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.
యాస్టర్ డీఎం హెల్త్ కేర్
బెంగళూరుతో కొత్త హాస్పిటల్ ప్రారంభంతో పాటు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ హెచ్ఎస్బీసీ తన టార్గెట్ను రూ.205కి పెంచడం స్టాక్కు కలిసొచ్చింది. మొదట్లో ఉత్సాహం కనిపించినా చివరకు కేవలం 3 శాతం లాభాలతో రూ.128 దగ్గర క్లోజైంది.
డీఎల్ఎఫ్.. ఏడేళ్ల తర్వాత
డీఎల్ఎఫ్ స్టాక్ వరుసగా ఏడో రోజు కూడా లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లలో కొద్దిగా ఆశలు రేపుతోంది. నాలుగేళ్ల తర్వాత వరుసగా ఇన్ని రోజుల పాటు ఇప్పుడే లాభపడడం. 2015 తర్వాత ఇప్పుడే అలాంటి ఉత్సాహం స్టాక్లో నమోదవుతోంది. చివరకు అర శాతం లాభంతో రూ.193.55 దగ్గర క్లోజైంది.
బైబ్యాక్ ఎఫెక్ట్
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఈ రోజు అనూహ్యంగా లాభపడి టాప్ గెయినర్గా నిలిచింది. రూ.2705 కోట్ల విలువైన ఎన్సిడిలు, మసాలా బాండ్లను తిరిగి కొనుగోలు చేయబోతున్న నేపధ్యంలో స్టాక్ లాభాల బాటలో నడిచింది. చివరకు స్టాక్ సుమారు 8 శాతం వరకూ పెరిగి రూ.691 దగ్గర ముగిసింది. ఇదే బాటలో ఇండియాబుల్స్ వెంచర్స్ కూడా 10 శాతం పెరిగి రూ.305 దగ్గర క్లోజైంది.
మళ్లీ బ్యాంకుల్లో ఉత్సాహం
ఈ రోజు బ్యాంకుల్లో కొద్దిగా ఉత్సాహం నమోదైంది. నిన్న కాస్త నీరసించిన స్టాక్స్ ఈ రోజు లాభాల బాటలో నడిచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 4 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.8 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.6 శాతం పెరిగాయి. అలహాబాద్ బ్యాంక్ 4 శాతం, యూకో బ్యాంక్ 4 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications