తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు: DA చెల్లింపు వివరాలివి...
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం బంపరాఫర్ ప్రకటించింది. డీఏ (Dearness Allowances) పెంచుతున్నట్లు చెప్పి తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు 3.144 శాతం డీఏ పెంచింది. దీంతో ఇప్పటి వరకు 27.248 శాతంగా ఉన్న డీఏ ఇక నుంచి 30.392 శాతానికి పెరిగింది. శనివారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ 1 జూలై 2018 నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించిన అమౌంట్ జూన్ నెల వేతనంతో కలిసి ఖాతాల్లో జమకానుంది.
కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కొత్త డీఏ వీరికే
2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జెడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్ సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి ఈ కొత్త డీఏ వర్తించనుంది.
డీఏ బకాయిల చెల్లింపు ఇలా
1 జూలై 2018 నుంచి 31 మే 2019 నాటికి డీఏ బకాయిల్ని ఉద్యోగుల జీపీఏ అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. 30 సెప్టెంబర్ 2019కి ముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిల్ని ప్రభుత్వం నగదు రూపంలో చెల్లిస్తుంది. 1 సెప్టెంబర్ 2004 తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు, 1 జూలై 2018 నుంచి 31 మే 2019 కాలానికి సంబంధించి పెరిగిన డీఏ బకాయీల్లో పది శాతాన్ని వారి ప్రాణ్ (పీఆర్ఏఎన్) ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన తొంబై శాతం డీఏ బకాయిల్ని జూన్ నెల వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లిస్తుంది. జీపీఎఫ్కు అనర్హులైన ఫుల్టైం కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను జూన్ నెల వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లిస్తుంది.
రిటైర్డ్ ఉద్యోగులకు...
రిటైర్డ్ ఉద్యోగులు జూలై నెలలో అందుకునే జూన్ నెల పింఛన్ మొదలుకొని డీఆర్ పెంపు కనిపిస్తుంది. వారికి జూలై 2018 నుంచి మే 2019 వరకు అందాల్సిన డీఆర్ బకాయిలన్నీ వారు ఆగస్ట్ 1వ తేదీన అందుకునే జూలై పింఛనుతో సహా నగదుగా చేతికి వస్తుంది.