నాథూరాం గాడ్సే దుమారం: ఆనంద్ మహీంద్రా స్పందన
బీజేపీ లోకసభ అభ్యర్థి సాద్వీ ప్రజ్ఞాసింగ్.. నాథూరాం గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు ఆమెపై నిప్పులు చెరుగుతున్నాయి. మరోవైపు, ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతమని, బీజేపీ పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తదితరులు బయటకు వచ్చారు.
సాద్వీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మన విలువలను మనమే నాశనం చేసుకుని తాలిబన్లుగా మారకూడదని హితవు పలికారు.
75 ఏళ్లుగా ప్రపంచం, భారతదేశాన్ని మహాత్ముడి జన్మభూమిగానే గుర్తిస్తోందని, ప్రపంచం నైతికతను కొల్పోయినప్పుడు మన దేశమే ముందు ఉండి దారి చూపిస్తోందని, ప్రపంచం అంతా మనల్ని పేదవారిగా చూస్తారని, కానీ బాపు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలిచి మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేశారని, కొన్ని విషయాలు పవిత్రంగానే ఉండాలని, మనకోసం మనం ఏర్పాటు చేసుకున్న విలువలను మనమే నాశనం చేసుకుని తాలిబన్లుగా మారకూడదని ట్వీట్ చేశారు.
ఆనంద్ ట్వీట్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోన్న నేపథ్యంలో సమాజానికి సరైన సందేశం ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు.