అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలా? గోల్డ్ కొనుగోలుకు కారణాలు!
నేడు (మంగళవారం మే 7) అక్షయ తృతీయ. ఈ రోజు బంగారం, వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే మంచిది అనే అభిప్రాయం ఉంది. అక్షయ తృతీయ రోజున అన్నింటి కంటే బంగారం దుకాణాలు కిటకిటలాడుతాయి. దాదాపు ప్రతి ఒక్కరు గ్రాము బంగారం అయినా కొనుగోలు చేయాలని భావిస్తారు. ఈ రోజున బంగారం కొనుగోలు చేయాలనే ఆచారం పురాణాల్లో ఎక్కడైనా ఉందా అంటే లేదనే చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు.
అక్షయం అంటే తరగనిది అని అర్థం. కాబట్టి ఈ రోజు బంగారం వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే అక్షయం అవుతుందని భావిస్తారు. అందుకే, కొంతమంది తమ వద్ద డబ్బు లేకున్నా అప్పు చేసి మరీ కాస్త బంగారం అయినా కొనుగోలు చేయాలని చూస్తారు.
SBI కార్డు ఉంటే గుడ్న్యూస్: అక్షయతృతీయ బంపరాఫర్, ఇక్కడ కొంటే 5% క్యాష్ బ్యాక్
ఇన్వెస్ట్ ఆలోచన ఉన్నవారు చాలామంది బంగారం పైన కూడా పెడతారు. ఇలాంటి వారిలో చాలామంది అక్షయ తృతీయ రోజును ఎంచుకుంటారు. బంగారంపై పెట్టుబడి ఉంటే భద్రత, రిస్క్ లేని పని, తెలివైన పని అంటుంటారు. బంగారం విలువ పెరుగుతుంది కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది అని చెబుతున్నారు. డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ఇలాంటి సమయంలో బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు. పైగా అక్షయ తృతీయ వచ్చింది.
పురాణాలు ఏం చెబుతున్నాయి?
అక్షయం అంటే క్షయం లేకుండా ఉండాలని అర్థం. ఎన్నటికీ తరగనిదని అర్థం. కానీ బంగారం కొనాలని ఏ ధర్మశాస్త్రాలు చెప్పలేదని అంటున్నారు. అసలు అక్షయ తృతీయ రోజున దానాలు చేస్తే మరింత మంచిదని చెబుతారు. ఈ రోజున చేసే దానాలు మంచి ఫలితాలనిస్తాయని అంటారు.
లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయంటారు. దానం చేయమని పురాణాలు చెబుతుంటే, బంగారం కొనుగోలు చేయడం ఆచారంగా మారిందని చెబుతున్నారు. అక్షయ తృతీయ నాడు చేసే దానాలు రెట్టింపు ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.