మీరే రూ.1 లక్షకోట్లు ఇచ్చారుగా, సమాధానం చెప్పు: రాహుల్ గాంధీకి అనిల్ అంబానీ షాక్
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పైన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షులు ఓ ద్వేషపూరిత అబద్దాలకోరు అని మండిపడ్డారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని ఎండగట్టేందుకు రాఫెల్ డీల్, అనిల్ అంబానీపై విమర్శలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలకు ఆధారాలు లేవని, తనపై చేస్తున్న అసత్య ప్రచారానికి ఎలాంటి విశ్వసనీయ సాక్షాలు లేవని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ! మీ పాలనలో మాకు రూ.1 కోట్ల కాంట్రాక్ట్స్ వచ్చాయి
ఈ అయిదేళ్ల పాలనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా అనిల్ అంబానీకి ఫేవర్గా ఉందని రాహుల్ గాంధీ తన ప్రచారంలో పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ తీవ్రంగా స్పందించింది. అంతకుముందు పదేళ్ల యూపీఏ హయాంలో (2004-2014) తమ రిలయన్స్ గ్రూప్ రూ.1లక్ష కోట్ల కాంట్రాక్ట్స్ దక్కించుకుందని గుర్తు చేశారు. టెలికాం, రోడ్స్, మెట్రో, పవర్, మౌలిక సదుపాయాలు వంటి భిన్న రంగాలలో ఈ కాంట్రాక్ట్స్ దక్కాయన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అని, ఆ కాంగ్రెస్.. రాహుల్ గాంధీ పార్టీయేనని గుర్తు చేశారు.
వీటికి సమాధానం చెప్పు
ఏ ప్రభుత్వం ఉన్నా దేశం కోసం తమవంతు కాంట్రిబ్యూషన్ చేస్తున్నామని, ఇది రిలయన్స్ గ్రూప్కు గర్వకారణమని పేర్కొన్నారు. భారత్ అవసరమైన పెట్టుబడులను ఆకర్షిస్తోందని, ఉద్యోగాలు సృష్టిస్తోందని, ఇది ఉజ్వల, బలమైన, అభివృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అన్నారు. రాహుల్ గాంధీ తన ప్రచారంలో పదేపదే అనిల్ అంబానీని టార్గెట్ చేయడంపై రిలయన్స్ గ్రూప్ ప్రశ్నించింది. అంతకుముందు పదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆశ్రిత పెట్టుబడిదారులకు మద్దతిచ్చిందా, నిజాయితీలేని వ్యాపారులకు అండగా నిలిచారా.. రాహుల్గాంధీ సమాధానం చెప్పాలన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై ఖండన
రాహుల్ గాంధీ తన ప్రచారంలో అనిల్ అంబానీని ఉద్దేశించి క్రోనీ కేపిటలిస్ట్ అని, నిజాయితీలేని వ్యాపారవేత్త అని ఆరోపించడాన్ని రిలయన్స్ గ్రూప్ ఖండించింది. ఇవి అర్థం లేని, అవాస్తవ ఆరోపణలు అన్నారు. రాహుల్ ఆరోపణలు ఆధారం లేనివని, వీటికి ఆధారాలు చూపించగలరా అని సవాల్ చేశారు. కావాలని ఎన్నికల కోసం చేస్తున్న అసత్య ప్రచారమన్నారు. రాహుల్ గాంధీ పదేపదే చేస్తున్న అసత్య ప్రచారాన్ని తాము పట్టించుకోలేదని, ఆయన అబద్దాలు చెబుతున్నప్పటికీ రాజకీయం కోసం చేస్తున్నాడని గ్రహించి ఓపిక పట్టామని రిలయన్స్ గ్రూప్ తెలిపింది. రిలయన్స్ గ్రూప్లో 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నారని, 8 మిలియన్ల షేర్ హోల్డర్స్ ఉన్నారని, ఇది పూర్తిగా దేశం కోసం డెడికేషన్తో పని చేస్తోందన్నారు.