దలాల్ స్ట్రీట్ కబుర్లు: సెన్సెక్స్ 665.. నిఫ్టీ 179 పాయింట్లు, లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఒక్క రోజు ముందు మార్కెట్లు పాజిటివ్ నోట్తో ముగిశాయి. సెన్సెక్స్ 665.44 పాయింట్ల లాభంతో ముగిసింది. అంటే 1.87శాతం లాభంతో 36,256.69 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 179.15 పాయింట్లకు ఎగబాకి 1.86శాతం అధికంతో 10,830.95 పాయింట్లు నమోదు చేసింది. గత కొద్దిరోజులుగా నష్టాల బాట పడుతున్న మార్కెట్లు గురువారం లాభాలతో ముగియడం శుభపరిణామం అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎఫ్&ఓ ఎక్స్పైరీ కావడం కూడా మార్కెట్లు లాభాల బాట పట్టడానికి ఒక కారణం కావచ్చిన నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు కేంద్రం శుక్రవారం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో కొన్ని పాజిటివ్ వైబ్స్ కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్లు అమాంతం పెరిగిపోయాయని వెల్లడించారు. అంతేకాదు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. రైతులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాల ప్రజలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. దీంతో రేపు కేంద్రం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో ఏదో మ్యాజిక్ చేయబోతోందని నిపుణులు భావిస్తున్నారు.
రామ్నాథ్ ప్రసంగంతో ఏదో ఆశ నెలకొందని అందుకే మార్కెట్లు లాభాలతో ముగిసినట్లు తెలుపుతున్నారు విశ్లేషకులు. మధ్యతరగతి కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలకు, పొదుపు పథకాల్లో ఏదో ఆశావాహక స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేపటి బడ్జెట్లో మార్కెట్లు ఏదో మంచిని ఆశిస్తున్నాయని అందుకే లాభాలబాట పట్టినట్లు అషికా స్టాక్ బ్రోకింగ్ ఏవీపీ సంజీవ్ జైన్ చెప్పారు. అంతేకాదు రూపాయి కూడా బలపడటం మార్కెట్ సెంటిమెంట్ను కూడా బలోపేతం చేసింది.