డిస్కౌంట్ ఆఫర్: ఎయిర్ ఏషియా క్రిస్మస్, న్యూఇయర్ డీల్స్
న్యూఢిల్లీ: క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల కోసం ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రత్యేక డిస్కోంట్ ఆఫర్ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా ఎయిర్ ఏషియా సంస్థ ఒకవైపు ప్రయాణానికి గోవా, కొచ్చి, గువాహతి, ఇంపాల్లకు రూ. 1,269 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
జనవరి నుంచి జూన్ వరకు బుకింగ్ చేసుకునే టిక్కెట్లపై కస్టమర్లు ఈ అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చని ఎయిర్ ఏషియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిర్ ఏషియా గ్రూపునకు చెందిన ఎయిర్ ఏషియా బెర్హద్, థాయ్ ఎయిర్ ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్లలో కౌలాలంపూర్-బ్యాంకాక్కు రూ. 2,999 నుంచి టికెట్ను ఆఫర్ చేస్తోంది.
అయితే ఇప్పటి నుంచి జనవరి 3 వరకు బుకింగ్ చేసుకున్న వారు జనవరి 10 నుంచి జూన్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. తాజాగా ఇటీవలే గో ఎయిర్ కూడా జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30, 2016 మధ్య కాలానికి ఒకవైపు ప్రయాణానికి రూ. 691గా టికెట్ ధరను ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.