అదే స్పీడ్... వారంలో రూ 1,000 కోట్ల పెట్టుబడులు! హైదరాబాద్ కంపెనీకి కూడా
ఇండియన్ స్టార్టుప్ కంపెనీలు మరోసారి దుమ్ము రేపాయి. ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచమంతా విజృంభిస్తుంటే... మన స్టార్టుప్ కంపెనీలు మాత్రం నిధుల వేటలో తమ సత్తా చాటుతున్నాయి. ఒక్క వారం రోజుల్లోనే ఏకంగా రూ 1,000 కోట్ల ప్రైవేట్ ఈక్విటీ నిధులను ఆకర్షించి ఔరా అనిపిస్తున్నాయి. సగటున ప్రతి వారం సుమారు రూ 1,000 కోట్ల నిధులను ఆకర్షిస్తూ సత్తా ఉన్న స్టార్టుప్ కంపెనీలకు నిధుల కొరత లేదని నిరూపిస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం... చైనా తో తెగదెంపులు వల్ల నిధుల వేగం తగ్గే అవకాశం ఉంటుందని అనుకున్నారు.
కానీ వారి అంచనాలను తోసిరాజని పెట్టుబడుల ప్రవాహం కొనసాగటం విశేషం. ఇదే స్పీడ్ కొనసాగితే మరిన్ని స్టార్టుప్ కంపెనీలకు నిధుల మద్దతు లభించనుంది. అమెరికా, చైనా తర్వాత ఇండియా లోనే అత్యధిక సంఖ్యలో స్టార్టుప్ కంపెనీలు ప్రారంభమవుతున్నాయి. అయితే నిధుల వేటలో మాత్రం ఆ రెండు దేశాల కంటే వెనుకబడి ఉన్నప్పటికీ... ఇప్పుడిప్పుడే ఇండియన్ స్టార్టుప్ కంపెనీలు గ్లోబల్ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ రాబడుతున్నాయి.
74 లక్షల షేర్లు విక్రయించిన ఆదిత్యపురి, HDFC షేర్లు ఢమాల్! బ్యాంకు ఏం చెప్పిందంటే..
15 కంపెనీలకు నిధులు...
గత వారం రోజుల్లో మొత్తంగా 15 కంపెనీలు పెట్టుబడులను ఆకర్షించాయి. ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ అథెర్ ఎనర్జీ సహా ఫిన్ టెక్ స్టార్టుప్ ఇన్ క్రెడ్, జోడో, బీజనిస్, ఎంట్రీ, స్మార్టివిటీ, జిగ్ఫోర్స్, వి గ్రో, సీబ్రోస్, ఎంపవరెడ్, ఐ నర్చర్, స్టైల్ డాట్ మీ అనే సంస్థలు తమ పెట్టుబడి వివరాలు వెల్లడించాయి. స్నాక్ అమోర్, క్లౌడ్ వర్క్స్, ఫినిన్ వంటి కంపెనీలు మాత్రం తమ పెట్టుబడి వివరాలను వెల్లడించలేదు. మొత్తంగా అన్ని కంపెనీలు కలిసి 131 మిలియన్ డాలర్లు (సుమారు రూ 982 కోట్లు) పెట్టుబడిగా సమీకరించాయి. వీటిలో అత్యధికంగా ఇన్ క్రెడ్ అనే కంపెనీ 66 మిలియన్ డాలర్ల పెట్టుబడిని రాబట్టింది. తర్వాత ఎంపవర్డ్ అనే కంపెనీ 21 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించింది. ఈ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక కథనం ఎంట్రాకర్ ప్రచురించింది.
హీరో నుంచి ...
అథెర్ ఎనర్జీ లో ప్రముఖ ద్వి చక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్ పెట్టుబడి పెట్టింది. ఎలెక్ట్రిక్ స్కూటర్ల కు ఇండియా లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో హీరో మోటో కార్ప్ అథెర్ ఎనర్జీ లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అథెర్ ఎనర్జీ లో ఈ ఒక్క కంపెనీయే సుమారు రూ 84 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. అదే సమయంలో చిన్న, మధ్య తరహా కంపెనీలకు రుణాలు అందించే ఫిన్ టెక్ స్టార్టుప్ కంపెనీ అయిన ఇన్ క్రెడ్ లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు భారీగా పెట్టుబడి పెట్టాయి. దీంతో ఈ కంపెనీకి 66 మిలియన్ డాలర్ల పెట్టుబడి.. అంటే రూ 495 కోట్ల నిధులు సమకూరాయి. దీంతో ఈ కంపెనీ భారీ సంఖ్యలో చిన్న సంస్థలకు రుణాలు అందించేందుకు మార్గం సుగమం అవుతుంది.
హైదరాబాద్ కంపెనీ కి కూడా..
ఆన్ డిమాండ్ మాన్ పవర్ సేవలు అందించే హైదరాబాద్ కు చెందిన ఒక స్టార్టుప్ కంపెనీ జిగ్ ఫోర్స్ కూడా తాజాగా నిధులు సమీకరించిన కంపెనీల జాబితా లో ఉండటం విశేషం. ఈ కంపెనీకి యూనైటస్ వెంచర్స్ అనే ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ రూ 60 కోట్ల పెట్టుబడిని అందించింది. దీంతో ఈ కంపెనీ మరింతగా తన సేవలను విస్తరించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇదిలా ఉండగా ఈ సారి నిధుల వేటలో కూడా ఎప్పటి లాగే ఫిన్ టెక్ కంపెనీలు అధికంగా పెట్టుబడులను ఆకర్షించాయి. ఆ తర్వాత అగ్రి టెక్ స్టార్టుప్ కంపెనీలు, ఎలక్ట్రిక్ టెక్ కంపెనీలు, ఫాషన్ టెక్నాలజీ, మానవ వనరుల సేవల కంపెనీ ఇలా దాదాపు అన్ని రంగాలకు చెందిన స్టార్టుప్ కంపెనీలు ఉన్నాయి. ఈ ట్రెండ్ మన దేశం లో కూడా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్ల ఆసక్తి అన్ని రంగాల్లోనూ ఉందని స్పష్టం చేస్తోంది.