గుడ్న్యూస్, ఆస్తి పన్నులో సగం మాఫీ: ఇప్పటికే చెల్లిస్తే ఎలా, పరిమితి ఎంత?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC) సహా తెలంగాణలోని నగరపాలక సంస్థలు, పురపాలకస సంఘాల్లో ఆస్తి పన్నులో 50 శాతం మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నుండి జూలై వరకు కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆస్తి పన్నులో సగం మాఫీ చేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. అదే సమయంలో జీహెచ్ఎంసీలో సఫాయిల వేతనాలను కూడా ప్రభుత్వం పెంచింది.
LTC cash voucher scheme: కేంద్రం మరో గుడ్న్యూస్, కుటుంబ సభ్యులు కూడా...
ఇప్పటికే చెల్లించిన వారికి ఏం చేస్తారు?
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆస్తి పన్నులో 50 శాతం వాటాను మాఫీ చేయడంతో పాటు ఇప్పటికే పన్నులు చెల్లించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు చేస్తారు. వచ్చే సంవత్సరం 50 శాత మొత్తాన్ని సర్దుబాటు చేస్తుంది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు వివిధ రూపాల్లో సాయమందిస్తోన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేసి, సామాన్యులపై భారం పడకుండా తాము భరిస్తామని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వన్ టైమ్ బెనిఫిట్ కింద 50 శాతంమాఫీ చేస్తున్నట్లు తెలిపింది.
పరిమితి ఉందా?
జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15వేలు, అంతకంటే తక్కువ, ఇతర నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో రూ.10వేలు అంతకంటే తక్కువ ఆస్తి పన్ను ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు ఇది వర్తిస్తుంది. సామాన్యులపై భారం పడకుండా లోన్ మారటోరియం కాలంలో చక్రవడ్డీని బ్యాంకులు.. కస్టమర్లకు అందిస్తే, ఆ తర్వాత బ్యాంకులకు కేంద్రం చెల్లిస్తుంది. అలాగే, ఇక్కడ కూడా నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు మాఫీ చేసిన పన్ను మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఎంతమందికి ప్రయోజనం, ప్రభుత్వంపై ఎంత భారం
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రాయితీ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో 13.72 లక్షల కుటుంబాలు, నగరాలు, పురపాలక సంఘాల్లో 17.68 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 31 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వంపై రూ.326 కోట్ల మేర భారం పడనుంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.196 కోట్లు, నగరాలు, పురపాలికల్లో 130 కోట్ల భారం పడనుంది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్ ఊరట ఇచ్చింది.