భారత్ మళ్లీ క్యాష్ వైపు వెళుతుంది.. ఛార్జీలు విధిస్తే యూపీఐ ఎవరూ వాడరు.. అష్నీర్ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి వెన్నెముకగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా అదనపు ఛార్జీలు విధించే దిశగా జరుగుతున్న పరిణామాలపై భారత్పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ తీవ్రంగా మండిపడ్డారు. యూపీఐపై ఛార్జీలు వసూలు చేయడం అనేది ప్రజలపై మరొక పన్ను మోపడమేనని ఆయన విమర్శించారు.
అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచిన వ్యవస్థపై రుసుములు విధిస్తే వినియోగదారులు, వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉచితంగా లభించే యూపీఐ మాత్రమే అసలైన వ్యవస్థ అని, ఒకవేళ దీనిపై రుసుములు వసూలు చేయడం ప్రారంభిస్తే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు 'టాటా, బై-బై' చెప్పినట్లేనని.. దాని ప్రాముఖ్యత తుడిచిపెట్టుకుపోతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రూపే డెబిట్ కార్డులు, రూ. 2 వేల వరకు ఉండే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరాదని ప్రభుత్వం సెప్టెంబర్ 14న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ చర్చ తెరపైకి వచ్చింది. అయితే రూ. 2 వేలు దాటిన పెద్ద లావాదేవీలపై ఛార్జీల మినహాయింపును స్పష్టంగా పేర్కొనకపోవడంపై గ్రోవర్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిమాణం పరంగా చూస్తే రూ. 2 వేలు పైబడిన లావాదేవీలు కేవలం 4 శాతమే ఉన్నప్పటికీ, మొత్తం లావాదేవీల విలువలో అవి ఏకంగా 66 శాతం వాటాను కలిగి ఉన్నాయని ఆయన వివరించారు. ఈ సంఖ్య ఆధారంగా మూడింట రెండు వంతుల విలువైన లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించి ప్రజల నుండి డబ్బు వసూలు చేయాలని చూడటం వెనుక ఎలాంటి తర్కం లేదని దుయ్యబట్టారు.
పెద్ద లావాదేవీలపై ఛార్జీలు విధిస్తే వ్యాపారులు ఆ భారాన్ని వినియోగదారులపైకి నెట్టే అవకాశం ఉందని.. లేదా లావాదేవీలను నిరాకరించి నగదు రూపంలో చెల్లించమని కోరవచ్చని గ్రోవర్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల రూ. 12 వేలు చెల్లించాల్సిన చోట వినియోగదారులు రూ. 2 వేలు చొప్పున ఆరుసార్లు చెల్లించడం లేదా అదనపు ఛార్జీలు కట్టడం కాకుండా మళ్లీ నగదు వాడకానికే ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. ఫలితంగా బ్యాంకింగ్ రంగంలో ఏటీఎంలు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు మళ్లీ పెరిగి దేశం వెనుకకు మళ్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీఐ రూ. 2.87 లక్షల కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయగా.. లిస్టెడ్ బ్యాంకుల లాభాలు రూ. 4.11 లక్షల కోట్లుగా, ఎన్పీసీఐ లాభం రూ. 1,888 కోట్లుగా ఉన్న తరుణంలో యూపీఐ వల్ల ఎవరికి నష్టం జరుగుతోందో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు.
మరోవైపు 2026 వర్షాకాల సమావేశాల్లో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10Aకి చేసిన సవరణ ద్వారా ఎన్పీసీఐ నేతృత్వంలోని కమిటీకి ఎంఈఆర్ రేట్లను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. రోజురోజుకూ పెరుగుతున్న లావాదేవీల రద్దీకి అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల ఆధునీకరణ మరియు మోసాల నివారణకు నిరంతరం భారీ పెట్టుబడులు అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది.
కేవలం ప్రభుత్వ సబ్సిడీలపైనే ఆధారపడకుండా వ్యవస్థను స్వయం సమృద్ధిగా మార్చడం, కొత్త కంపెనీల ప్రవేశాన్ని ప్రోత్సహించడం కోసమే ఈ చట్రాన్ని తెస్తున్నట్లు తెలిపింది. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ, 2017 ఆర్థిక సంవత్సరంలోని రూ. 0.07 లక్షల కోట్ల విలువ నుండి 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 314 లక్షల కోట్లకు పెరిగి 4,000 రెట్ల వృద్ధి సాధించింది. సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, ఇటీవల ఉజ్బెకిస్తాన్తో కలిపి 11 దేశాలకు విస్తరించిన ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతూనే సుస్థిరమైన ఆదాయ నమూనాను ఎలా రూపొందించాలనే అంశంపై ప్రస్తుతం సుదీర్ఘ చర్చ నడుస్తోంది.


Click it and Unblock the Notifications

