Sovereign Gold Bond Scheme: ధర రూ.5000, అలా తీసుకుంటే రూ.50 తక్కువ
ముంబై: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సిరీస్ IX ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయించింది. ఈ ధరను రూ.5,000గా నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 1 వ తేదీ వరకు ఈ బాండ్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ పద్ధతిలో చెల్లింపు చేస్తే రూ.50 రాయితీ ఉంటుంది. నవంబర్ 9 నుండి 13వ తేదీ మధ్య ఇష్యూ చేసిన గోల్డ్ బాండ్స్ గ్రాముకు రూ.5177గా విక్రయించింది.
ఆ యాప్స్తో చాలా జాగ్రత్త, ఉచ్చులో పడొద్దు: RBI హెచ్చరిక, పలువురి అరెస్ట్
బాండ్ కాలపరిమితి
డిజిటల్ రూపంలో బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 2015లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకులు స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. బాండ్స్ కాలపరిమితి ఎనిమిది ఏళ్లు. అవసరమైతే ఐదేళ్ల తర్వాత పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చు. కేంద్రం తరఫున ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ జారీ చేస్తుంది. కరోనా సమయంలో పసిడికి విపరీతమైన డిమాండ్ కనిపించింది. 2015లో తొలిసారి ప్రారంభించినప్పుడు రూ.245 కోట్ల వ్యాల్యూ కలిగిన 9.14 లక్షల యూనిట్లకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 2016 అక్టోబర్లో రూ.1,081 కోట్ల వ్యాల్యూతో 35.98 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అప్పుడు యూనిట్ రూ.3,007గా ఉంది.
బాండ్స్ పైన వడ్డీ
గోల్డ్ బాండ్స్ కోసం బ్యాంకు ద్వారా సబ్స్క్రైబ్ కావొచ్చు. పోస్టాఫీస్లలో కూడా అందుబాటులో ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజెస్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పసిడి బాండ్స్ కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ రెండు దభాలుగా చెల్లించబడుతుంది. ఇది ఇష్యూ జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు.
పన్ను ఇలా..
సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు. పెట్టుబడిదారులను భౌతిక బంగారు పెట్టుబడుల నుండి బాండ్స్ వైపు ప్రోత్సహించేందుకు అందించే ప్రత్యేక ఆదాయ పన్ను ప్రయోజనం. మూలధన లాభాల పన్ను నుంచి పన్ను మినహాయింపు గోల్డ్ ఈటీఎప్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో లేదు.
నిష్క్రమణ
గోల్డ్ బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు కాగా ముందే నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎక్స్చేంజీల ద్వారా విక్రయిస్తే కొనుగోలు చేసిన తేదీ నుండి మూడేళ్ల లోపు ఉండే స్వల్పకాలంగా పరిగణిస్తారు. మీ స్థూల మొత్తం ఆదాయానికి జోడించి వ్యక్తిగత ఆదాయ స్లాబ్ వద్ద ఆదాయపు పన్ను వర్తిస్తుంది. మూడేళ్లకు పైబడి ఉండే దీర్ఘకాలిక లాభాలు 20.8 శాతం పన్ను వర్తిస్తుంది.
కొనుగోలు పరిమితి
కనీసం ఒక గ్రాము నుండి నాలుగు కిలోల వరకు ఎంత అయినా కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు వంటివి అయితే ఇరవై కిలోలు కొనుగోలు చేయవచ్చు. బాండ్ కొనుగోలు చేసిన సమయానికి ముందు ఇండియా బులియన్, జ్యువెల్లరీస్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం మూడు రోజుల ధరల సరాసరిని ఆధారంగా తీసుకొని బాండ్స్ విక్రయిస్తారు. ఈ బాండ్స్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. బాండ్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి మూలధన పన్ను చెల్లించకుండా పూర్తి డబ్బును పొందవచ్చు. ఒకవేళ పెట్టుబడిదారు మధ్యలో తన బాండును ఇతరులకు బదలీ చేస్తే దీర్ఘకాలిక మూలధన వడ్డీ చెల్లించాలి.