Akshaya Tritiya: కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్?
రేపు (శుక్రవారం మే 14) అక్షయ తృతీయ. ఈ పర్వదినం రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే మంచిది అని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం దుకాణాలు కిటకిటలాడుతాయి. దాదాపు ఎంతోమంది కనీసం గ్రాము బంగారం అయినా కొనుగోలు చేయాలని భావిస్తారు. అక్షయం అంటే తరగనిది. కాబట్టి ఈ రోజు బంగారం వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే అక్షయమవుతుందని భావిస్తారు. అందుకే, కొంతమంది తమ వద్ద డబ్బు లేకున్నా అప్పు చేసి మరీ కాస్త బంగారం అయినా కొనుగోలు చేసేవారు ఉంటారు.
కొనుగోలు చేస్తే మంచిదే
ప్రస్తుతం దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు రూ.47,500 వద్ద, అంతర్జాతీయ మార్కెట్లో 1820 డాలర్ల వద్ద ఉంది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో స్వల్పకాలానికి లేదా దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. సమీప భవిష్యత్తులో మళ్లీ ధరలు పెరిగే అవకాశమన్నాయి. కాబట్టి స్వల్పకాలానికి పెట్టడం మంచిదేనని చెబుతున్నారు. ఇక దీర్ఘకాలానికి ఇలాంటి పెట్టుబడి మంచిదేనని చాలామంది భావిస్తారు. మొత్తానికి రిటర్న్స్ ఉంటాయని చెబుతున్నారు.
కానీ... కరోనా పడగ
వరుసగా రెండో ఏడాదీ అక్షయ తృతీయకు కరోనా సెగ తప్పట్లేదు. గత ఏడాది కరోనా దెబ్బకు దేశవ్యాప్త లాక్డౌన్ను కేంద్రం అమలు చేసింది. ఈ ఏడాది సెకండ్ వేవ్ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లేదా కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో ఈసారి కూడా అక్షయ తృతీయ రోజున అమ్మకాలు అంతగా ఉండవని బంగారం వ్యాపారులు భావిస్తున్నారు. కరోనా కారణంగా మార్కెట్లో నెగెటివ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ నెలకొందని రత్నాలు, ఆభరణాల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మరింత గుదిబండ
కరోనా ప్రారంభం నుండి శుభకార్యాలు తగ్గిపోయాయి. ఒకవేళ ఏదైనా శుభకార్యం జరిగినా పరిమిత సంఖ్యలోనే హాజరు కావాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లలేని ఈ పరిస్థితుల్లో బంగారం, నగల కొనుగోలు చేయడానికి బయటకు వచ్చేవారు తక్కువే. పైగా లాక్ డౌన్ ఆంక్షలు మరింత గుదిబండగా మారాయి.