ఎస్బీఐ బంగారు రుణంపై వడ్డీ రేటు ఎంతంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బంగారు రుణాల వడ్డీ రేట్లను 7.75 శాతం నుండి 7.50 శాతానికి తగ్గించింది. బంగారం తాకట్టులో ఉంచడం ద్వారా రూ.50 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. కనీస రాతపని, తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకులు విక్రయించే బంగారు నాణేలతో పాటు ఆభరణాలు తాకట్టు పెట్టవచ్చు. ఎస్బీఐ బంగారు రుణాలపై ఛార్జీని ఇప్పుడు రుణమొత్తంలో 0.25 శాతం, జీఎస్టీని ప్రాసెసింగ్ ఫీజుగా తీసుకుంటోంది. కనీసం రూ.250. జీఎస్టీ అదనం. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజులేదు.
2020 ఆగస్ట్ నెలలో బంగారు ఆబరణాలపై రుణ వ్యాల్యూను ఆర్బీఐ పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు 2021 మార్చి వరకు బంగారు ఆభరణాల విలువలో 90 శాతం వరకు రుణంగా పొందవచ్చు. గతంలో ఇది 75 శాతంగా ఉంది. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఎస్బీఐ నుండి వ్యక్తిగత బంగారు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులు లేదా ఉమ్మడి ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవచ్చు. స్థిర ఆదాయవనరు కలిగి ఉండాలి. రుణం కోసం ఆదాయ రుజువు అందించాల్సిన అవసరం లేదు.
ఈ రుణాలు 36 నెలల్లో తిరిగి చెల్లించాలి. ఈ రుణం కింద గరిష్టంగా రూ.50 లక్షలు, కనీసం రూ.20వేలు తీసుకోవచ్చు. ఎస్బీఐలో వేర్వేరు స్కీంలకు వేర్వేరు తిరిగి చెల్లించే కాలపరిమితులు ఉన్నాయి. అసలు, వడ్డీ చెల్లింపులు రుణం మంజూరు అయిన నెల రోజుల నుండి ప్రారంభమవుతుంది. ఎస్బీఐ గోల్డ్, ఎస్బీఐ గోల్డ్ లోన్స్లో కాలపరిమితి 36 నెలలు కాగా, ఎస్బీఐ బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ కాలపరిమితి 12 నెలలు.