రిటైర్మెంట్ టైమ్ బాంబ్ ముంచుకొస్తోంది.. భారత మధ్యతరగతి ప్రజలకు వార్నింగ్ బెల్ ఇస్తున్న నిపుణులు..
Retirement Time Bomb: జీవితంలో 35 ఏళ్ల వయస్సు దాటినా పెట్టుబడులు ప్రారంభించని ఉద్యోగులకు ఆర్థిక నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకానొక వయసులో ప్రతి ఉద్యోగికీ క్రియాశీల ఆదాయం లేదా జీతం రావడం ఆగిపోతుంది, కానీ వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు, రోజువారీ నిర్వహణ వ్యయాలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. పదవీ విరమణ తర్వాత దశాబ్దాల పాటు జీవించడానికి తగినంత ఆర్థిక భద్రత లేకపోతే జీవితపు చివరి సంవత్సరాలు అత్యంత కఠినంగా మారతాయని మిరే అసెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వైస్ చైర్మన్ మరియు సీఈఓ స్వరూప్ మొహంతి హెచ్చరించారు.
ఫిన్నోవేట్తో జరిగిన ఒక చర్చలో ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో ఆయుర్దాయం పెరుగుతోందని, 35 ఏళ్ల వయస్సులోనే ప్రతి ఒక్కరూ తమ సుదీర్ఘ భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతం ఆగిపోయాక, మన దగ్గర మిగిలిన నిధుల ఆధారంగానే జీవించాల్సి ఉంటుందని, ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఆ దశ చాలా భయానకమైన పరిస్థితికి దారితీస్తుందని స్పష్టం చేశారు. చిన్న వయస్సులోనే పెట్టుబడులు ప్రారంభించకపోవడం వల్ల లభించే 'కాంపౌండింగ్' ప్రయోజనాన్ని పూర్తిగా కోల్పోతామని ఆయన వివరించారు.

ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో నెలకు రూ. 10 వేల నుండి రూ. 20 వేల వరకు 12 శాతం వడ్డీ ఇచ్చే సాధనాల్లో పెట్టుబడి పెడితే పదవీ విరమణ సమయానికి రూ. 10 కోట్లు సమకూరే అవకాశం ఉంటుంది. అదే లక్ష్యాన్ని 40 ఏళ్ల వయసులో ప్రారంభించాలంటే నెలకు దాదాపు రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని.. ఇది ముందస్తుగా పెట్టుబడి పెట్టకపోవడం వల్ల జరిగే భారీ అవకాశ వ్యయమని పేర్కొన్నారు. 35 ఏళ్లు వచ్చినా ఇంకా మించిపోయిందేమీ లేదని.. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే పెట్టుబడులను ప్రారంభించాలని ఆయన హితవు పలికారు. అలాగే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, నాణ్యమైన వైద్య బీమా లేకపోవడం కూడా అతిపెద్ద పొరపాటవుతుందని గుర్తుచేశారు.
మరోవైపు కేవలం సంపదను కూడబెట్టడమే కాకుండా పదవీ విరమణ తర్వాత దానిని ఎలా సురక్షితంగా ఉపసంహరించుకోవాలో (Withdrawal Strategy) తెలుసుకోవడం కూడా అత్యంత కీలకమని పదవీ విరమణ వ్యూహకర్త మిలింద్ డియోగావ్కర్ తెలిపారు. చాలామంది ఆర్థిక నిధిని సిద్ధం చేసుకున్నప్పటికీ, అది ఎంతకాలం వస్తుందో తెలియక భయంతో ప్రయాణాలను, ఆరోగ్య పరీక్షలను వాయిదా వేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సాధారణ ద్రవ్యోల్బణం 6 నుండి 7 శాతంగా ఉండగా, వైద్య ద్రవ్యోల్బణం 12 నుండి 14 శాతంగా నమోదువుతోంది. ఈ పరిస్థితిలో సాంప్రదాయ భారతీయ విశ్రాంత ఉద్యోగులు తమ వద్ద ఉన్న నిధి నుండి ఏటా కేవలం 2.5 నుండి 3.5 శాతం మాత్రమే విత్డ్రా చేసుకోవడం సురక్షితమని ఆయన అంచనా వేశారు. 3 శాతం ఉపసంహరణ నిబంధన ప్రకారం చూస్తే, రూ. 2 కోట్ల నిధి ఉంటే నెలకు రూ. 60,000, అలాగే రూ. 3 కోట్ల నిధి ఉంటే నెలకు రూ. 90,000 వరకు లభిస్తాయి. మెట్రో నగరాల్లో నివసించే దంపతులు తమ ప్రధాన పదవీ విరమణ నిధి దెబ్బతినకుండా ఉండేందుకు, అత్యవసర వైద్య ఖర్చుల కోసం రూ. 35 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ప్రత్యేక ఆరోగ్య నిధిని కేటాయించుకోవాలని సూచించారు.
చివరగా ఈ హెచ్చరికలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి కాదని, కఠోర వాస్తవాన్ని తెలియజేయడానికేనని మొహంతి స్పష్టం చేశారు. 90 లేదా 95 ఏళ్ల వరకు జీవించే క్రమంలో చివరి 10 నుంచి 15 ఏళ్ల జీవితం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సాగాలంటే, ముందస్తు ప్రణాళిక మరియు సరైన పెట్టుబడులు అత్యంత ఆవశ్యకమని నిపుణులు తేల్చిచెబుతున్నారు.


Click it and Unblock the Notifications
