ఆదాయ పన్ను శాఖ కొత్త నిబంధనలు, ఈ ఐదింటి గురించి తెలుసుకోండి
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్ 1వ తేదీ నుండి ఎన్నో మార్పులు, చేర్పులు ఉంటాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని మార్పులు ప్రకటించారు. ఈ మార్పులు నేటి నుండి (ఏప్రిల్ 1) అమలులోకి వస్తున్నాయి. టీడీఎస్, సీనియర్ సిటిజన్లు, పీఎఫ్ పన్ను నియమాలు, ప్రీ-ఫిల్డ్ ఐటీఆర్ ఫామ్స్, ఎల్టీసీ మినహాయింపు సహా పలు అంశాలు ఉన్నాయి.
శాలరీ స్ట్రక్చర్లో ఎలాంటి మార్పులేదు, కంపెనీలకు భారీ ఊరట
టీడీఎస్, టీసీఎస్
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని వారికి అధిక TDS, TCS వర్తింప చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందుకు ఐటీ చట్టంలోని సెక్షన్ 206ఏబీ, సెక్షన్ 206సీసీఏలను చేర్చారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనలను తెచ్చింది. గత రెండేళ్లలో రూ.50వేలు, అంతకంటే ఎక్కువ టీడీఎస్, టీసీఎస్ ఉన్న వారికి నిర్దిష్ట రేటు కంటే రెట్టింపు లేదా ఐదు శాతం.. ఏది ఎక్కువైతే ఆ రూపంలో పన్ను వసూలు చేస్తారు.
వారికి నో ఐటీ రిటర్న్స్
75 ఏళ్లకు పైబడిన వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్స్ను దాఖలు చేయనవసరం లేదని బడ్జెట్ 2021లో నిర్మలమ్మ ప్రకటించారు. దీంతో సీనియర్ సిటిజన్లపై సమ్మతి భారం తగ్గుతుంది. ఫించన్, వడ్డీల ద్వారా మాత్రమే ఆదాయం ఉన్న 75 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చే వారికి వర్తించదు. పెన్షన్, వడ్డీ చెల్లించే బ్యాంకులు అవసరమైన మేరకు పన్ను(TDS) వసూలు చేస్తాయి.
పీఎఫ్ పైన పన్ను
పీఎఫ్ ఖాతాలో ఉద్యోగులు, యాజమాన్య వాటా కలుపుకొని ఏడాదిలో రూ.2.50 లక్షలకు మించి జమ అయినట్లయితే దానిపై లభించే వడ్డీకి పన్ను పడుతుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తోంది. అయితే ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులను రూ.5 లక్షలకు పెంచారు. కానీ ఈపీఎఫ్కు జమ చేసిన మొత్తంలో సంస్థ వాటా ఉండకూడదు. అలాగే, రెండేళ్ల పాటు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే మీ టీడీఎస్, టీసీఎస్ రేటు రెండింతలు అవుతుంది.
ప్రీ-ఫిల్డ్ ఫామ్
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రీ-ఫిల్డ్ ఐటీ ఫామ్స్ జారీ చేస్తారు. ఆదాయపు పన్ను దాఖలు ప్రాసెస్ను సులభతరం చేసేందుకు ఈ కొత్త విధానం తీసుకు వచ్చారు. ఇందులో పన్ను చెల్లింపుదారుని శాలరీ, పన్ను చెల్లింపులు, టీడీఎస్ తదితర వివరాలు పన్ను ఫారంలో ముందే పూర్తి చేసి వస్తాయి. రిటర్న్స్ను మరింత సులభతరం చేసేందుకు లిస్టెడ్ సెక్యూరిటీల మూలధన రాబడి వివరాలు, డివిడెండ్ ఆదాయం, బ్యాంకులు, పోస్టాఫీస్ డిపాజిట్ పైన వచ్చే వడ్డీ ఆదాయం వంటి వివరాలు కూడా ఈ ఫాంలో ఉంటాయి.
ఎల్టీసీ క్యాష్ వోచర్
ఎల్టీసీకి బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఫబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్లో నిర్మలమ్మ ప్రతిపాదించారు. కరోనా కారణంగా ఎల్టీసీ పన్ను ప్రయోజనం పొందలేకపోయిన వారికి కేంద్రం గత ఏడాది ప్రకటించింది. ఈ పథకం మార్చి 31, 2021 వరకు ముగిసింది. ఈ తేదీ లోపు ఖర్చు చేసిన మొత్తంపై వర్తిస్తుంది.