2016 నవంబర్ తర్వాత మొదటిసారి.. భారీగా తగ్గిన బంగారం ధర: అక్కడకు వస్తేనే మరింత తగ్గొచ్చు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం కూడా క్షీణించాయి. ఓ నెలలో పసిడి ధర అత్యంత దారుణంగా పతనం కావడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి. కరోనా కారణంగా ఆరు నెలల పాటు పెరిగిన పసిడి ధరలు, ఈ సెప్టెంబర్లో అదేస్థాయిలో క్షీణించాయి. దీంతో నాలుగేళ్ల తర్వాత ఓ నెలలో రికార్డ్ స్థాయిలో పతనమయ్యాయి. దేశీయ మార్కెట్లోను పసిడి ధరలు రికార్డ్ స్థాయిలో తగ్గాయి. ఆగస్ట్ 7 రికార్డ్ ధర రూ.56,200 నుండి దాదాపు రూ.6000 క్షీణించాయి. వెండి కిలో రూ.18వేల నుండి రూ.20వేల మేర క్షీణించింది. రష్యా వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చాక బంగారంపై ఒత్తిడి తగ్గింది.
50% కంటే ఎక్కువ భారతీయులు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సిద్ధం కాలేదు
2016 నవంబర్ తర్వాత మొదటిసారి..
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.67 శాతం క్షీణించి 1,885 డాలర్లు పలికింది. సెప్టెంబర్ నెలలో పసిడి ధర 4.3 శాతం మేర తగ్గింది. నవంబర్ 2016 నుండి ఒక నెలలో దారుణ పతనం. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం క్షీణించి 1,890.90 డాలర్లు పలికింది. ఇక, నిన్న వెండి ఔన్స్ 1.69 శాతం క్షీణించి 23.87 డాలర్లు పలికింది. మార్చి నుండి 16 శాతం మేర పడిపోయింది. సెప్టెంబర్లో ఔన్స్ పసిడి 2,075 డాలర్లను దాటింది. ఇప్పుడు 1,900 డాలర్ల దిగువకు చేరుకుంది. దాదాపు 200 డాలర్ల మేర క్షీణించింది.
ఆ మార్క్కు వస్తేనే.. తగ్గినట్లు!
బంగారం ధరలు ఔన్స్ 1,840 డాలర్లకు పైన ఉన్నంత కాలం పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పెరుగుదల పుంజుకోవాలంటే మాత్రం 1,900 డాలర్లను దాటవలసి ఉంటుందని అంటున్నారు. ఔన్స్ ధర 1,840 డాలర్ల కంటే క్షీణిస్తే మాత్రం పసిడి బలహీనానికి సంకేతంగా భావించవచ్చునని అంటున్నారు. డాలర్ వ్యాల్యూ పుంజుకోవడంతో పసిడిపై ఒత్తిడి తగ్గింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ ఔన్స్ 0.4 శాతం పెరిగి 891.95 డాలర్లు, పల్లాడియం ఔన్స్ 0.2 శాతం పెరిగి 2,309.07 డాలర్లు పలికింది.
దేశీయ మార్కెట్లో ధర..
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు 0.6 శాతం క్షీణించి రూ.50,305 పలికింది. వెండి 0.25 శాతం తగ్గి కిలో రూ.60,055 పలికింది. అంతకుముందు సెషన్లో పసిడి 0.6 శాతం తగ్గగా, వెండి 4 శాతం తగ్గింది. ఎంసీఎక్స్లో పసిడి మద్దతు ధర రూ.49,200, నిరోధకస్థాయి రూ.51,120గా ఉండవచ్చు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పసిడి ధరలు రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం రూ.52,800, 22 క్యారెట్ల బంగారం రూ.48,350కి చేరుకుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.53,700 దిగువన ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.49,200 పలికింది.