ఐటీఆర్లో కీలక మార్పు: కరెంట్ బిల్లు రూ.లక్ష దాటితే ITR1 చెల్లదు, వీరందరికీ కొత్త ఫారం..
వ్యక్తిగత ఆధాయపు పన్ను రిటర్న్స్ సమర్పించేందుకు ఉపయోగింటే ITR దరఖాస్తుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) మార్పులను నోటిఫై చేసింది. ITR 1లో ప్రభుత్వం మరిన్ని మార్పులు చేసి ఆదాయ వర్గాలను ఈ రిటర్న్స్ ఫారం నుంచి మినహాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీ ప్రభుత్వానికి షాక్, రూ.10వేల కోట్లు తగ్గిన ఆదాయం
ఇప్పటి వరకు..
ప్రస్తుత నిబంధనల ప్రకారం వార్షిక ఆదాయం రూ.50 లక్షల వరకు ఉన్న సామాన్య వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ITR-1 సహజ్ ఫారంలో రిటర్న్స్ ఫైల్ చేయాలి. వార్షిక ఆదాయం రూ.50 లక్షల వరకు ఉన్న అవిభక్త హిందూ కుటుంబాలు (HUF), సంస్థలతో పాటు వ్యక్తులు ITR-4 సహజ్ ఫారంలో తమ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
ITR-1, ITR-4 మార్పులు...
ఇది 2020-21 అసెస్మెంట్ ఇయర్ (AY) నుంచి ITR-1, ITR-4 ఫారాల్లో రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఈ కింది వ్యక్తులు అర్హులు కాదని ప్రకటించింది. వీరు ఏ ఫారంలో తమ రిటర్న్స్ ఫైల్ చేయాలనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని పేర్కొంది. ఇందుకు ప్రత్యేక దరఖాస్తులు రూపొందిస్తున్నట్లు తెలిపింది.
కరెంట్ బిల్లు లక్ష దాటినా, విదేశీ పర్యటనకు రూ.2 లక్షలు ఖర్చు చేసినా..
ఇద్దరు, అంతకుమించిన వ్యక్తుల సంయుక్త యాజమాన్యంలో ఇంటి ఆస్తులు ఉన్నా, విద్యుత్ బిల్లు ఏడాదిలో రూ.1 లక్ష చెల్లించినా, విదేశఈ ప్రయాణంపై రూ.2 లక్షలు వెచ్చించినా అలాంటి వారి ఇకపై వార్షిక ఆదాయ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ITR-1 వినియోగించకూడదని నోటిఫై చేసింది. 2020-21 అసెస్మెంట్ ఇయర్కు వ్యక్తిగత ITR దరఖాస్తులను ఈసారి జనవరిలోనే నోటిఫై చేసింది. గతంలో వీటిని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేది.
వీరికి వర్తించదు...
- వార్షిక మొత్తం ఆదాయం రూ.50 లక్షలు దాటని సాధారణ భారతీయులు ITR-1 సహజ్లో తమ ఆదాయపు పన్ను వివరాలు సమర్పించాలి.
- హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్లు రూ.50 లక్షల వరకు ఆదాయం పొందుతుంటే (వ్యాపారం లేదా వృత్తి ద్వారా) ITR-4 సుగమ్ దరఖాస్తు చేయాలి.
- వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడికి ఇద్దరు, అంతకుమించిన వ్యక్తుల సంయుక్త యాజమాన్యంలో ఇల్లు ఉంటే ITR-1, ITR-4 రిటర్న్స్ సమర్పించలేరు. ఆ ఇంటిపై వచ్చే ఆదాయాన్ని తప్పకుండా చూపాలి.
- బ్యాంకు ఖాతాలో ఏడాది మొత్తమ్మీద రూ.1 కోటి డిపాజిట్ చేసినా, విదేశీ ప్రయాణంపై ఏడాదికి రూ.2 లక్షలు ఖర్చు చేసినా, ఏడాదిలో రూ.1 లక్ష విద్యుత్ బిల్లు చెల్లించినా ITR-1 దరఖాస్తు సమర్పించలేరు.
- ఇలాంటి పన్ను చెల్లింపుదారుల కోసం వేర్వేరు దరఖాస్తులను రూపొందిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. తర్వాత వాటిని నోటిఫై చేస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్లో తెలిపింది.