సరికొత్త ఫీచర్: రూ.5తోను 24 క్యారెట్ల బంగారం ఇలా కొనుగోలు చేయవచ్చు!
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో రూ.40వేల లోపు ఉన్న పసిడి ధరలు ఇప్పుడు రూ.55వేలకు చేరువయ్యాయి. పదిహేను రోజుల క్రితం రికార్డ్ ధరకు చేరుకున్నప్పటికీ, అప్పటి నుండి రూ.4వేలకు పైగా క్షీణించింది. అయినప్పటికీ మార్చి నుండి దాదాపు రూ.12 వేలకు పైగా పెరిగింది. ఈ సమయంలో 10 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. అందుకు పలు కారణాలు. బంగారం ధర పెరుగుతుందా, తగ్గుతుందా ఒకటి అయితే, ఇంతలా పెరిగితే కొనుగోలు చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
రూ.4,000కు పైగా తగ్గిన పసిడి ధర, ఆ ధర వద్ద కొనుగోళ్లు...!
గోల్డ్ వాల్ట్ ఫీచర్.. 24 క్యారెట్ల గోల్డ్
బంగారం ధరలు అస్థిరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు చెందిన అమెజాన్-పే బంగారంపై తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మంచి అవకాశం కల్పిస్తోంది. తమ కస్టమర్లకు డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే కొత్త స్కీంను తీసుకు వచ్చింది. అమెజాన్ పేలో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గోల్డ్వాల్ట్ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు అతి తక్కువ మొత్తంతో పసిడిని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ పే కొత్త ఫీచర్ ద్వారా కొనుగోలు చేసే బంగారం 99.5 శాతం స్వచ్ఛత కలిగినది. 24 క్యారెట్ బంగారం అని అమెజాన్ పే తెలిపింది.
రూ.5కే బంగారం కొనుగోలు చేయవచ్చు
కేవలం రూ.5కే డిజిటల్ రూపంలో పసిడిని కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ అంటే బంగారం భౌతికంగా చేతికి రాదు. కానీ మనం డిజిటల్ మార్గంలో బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే, డిజిటల్ రూపంలో ఉంటుంది. ఇలా కస్టమర్కు సౌకర్యంగా ఉన్నప్పుడల్లా చిన్న మొత్తాల్లో పసిడిని ఇలా కొనుగోలు చేయవచ్చు. అవసరం లేదనుకుంటే ఒకేసారి విక్రయించవచ్చు. లేదా మనం జమ చేసిన సొమ్ముకు సరిపడా బంగారాన్ని తీసుకోవచ్చు.
ఎక్కువ మొత్తం జమ..
దీర్ఘకాలం చిన్నమొత్తంతో పసిడిని డిజిటల్ రూపంలో కొనుగోలు చేస్తూ వెళ్తే మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో జమ అవుతుంది. భౌతిక రూపంలో ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనలేని వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, మొబిక్విక్ వంటి యాప్స్ డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తున్నాయి.