34,000% పెరిగిన తెలుగు కంపెనీ షేర్లు, పదేళ్ల క్రితం రూ1 లక్ష పెడితే ఇప్పుడు రూ 3 కోట్లు చేతికి
స్టాక్ మార్కెట్ (షేర్ మార్కెట్) లో పెట్టుబడులు అంటేనే రిస్క్ అంటారు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా మందిని కోటీశ్వరులను చేశాయి. అయితే, ఎదో కొద్దిమంది మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. 99% శాతం రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం ఇవాళ పెడితే రేపే లాభం రావాలని ఆశిస్తారు. అందులో చాలా మంది దెబ్బ తింటారు. అందుకే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరులు ఐన వారు కొందరే కనిపిస్తే... నష్ట పోయిన వారే అధికంగా కనిపిస్తారు. అమెరికా స్టాక్ మార్కెట్ మాంత్రికుడు వారెన్ బఫెట్ ... ఇండియన్ స్టాక్ మార్కెట్ కింగ్ రాకేష్ ఝున్ ఝున్ వాలా లాగా మనమూ బిలియనీర్స్ కావాలంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఒక మార్గమే.
కానీ తెలివిగా, దీర్ఘకాలిక లక్ష్యంతో మదుపు చేస్తేనే లాభం. లేదంటే ఆశించిన ప్రయోజనం శూన్యం అంటారు నిపుణులు. మిగితా వారి విషయం అలా ఉంచితే.. మన తెలుగు కంపెనీ ఒకటి తన ఇన్వెస్టర్ల ను కుబేరులను చేసింది. ఒక్క దశాబ్ద కాలంలో భారీ రాబడిని ఆర్జించి పెట్టింది. పదేళ్ల క్రితం ఆ కంపెనీ లో రూ 1,00,000 పెట్టుబడి పెట్టిన వారికి ... ఇప్పుడు రూ 3.43 కోట్ల ప్రతిఫలితాన్ని సృష్టించింది. దీనిపై ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. దాని ఆధారంగా మీకోసం కొన్ని వివరాలు.
అమెరికా-ఇరాన్ టెన్షన్: బంగారం, ఆయిల్ సహా వీటిపై భారీ ప్రభావం
2009 లో రూపాయి... ఇప్పుడు రూ 569!
తెలుగు కంపెనీ ఐన అవంతి ఫీడ్స్ ... ఆక్వా కల్చర్ విభాగం లో వ్యాపారం చేస్తోంది. అక్ష్వా సంబంధిత ఫీడ్ సహా ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమైంది. ఈ కంపెనీలో ఎవరైనా 2009 డిసెంబర్ 31 న రూ 1,00,000 పెట్టుబడి పెట్టి ఉంటె... అది కాస్త ఇప్పుడు రూ 3.43 కోట్లు అయి ఉండేది. ఎందుకంటే ఆ రోజు కంపెనీ ఒక్కో షేర్ విలువ రూ 1.66 (రూపాయి అరవై పైసలు) ఉండగా... ఇప్పుడు అది రూ 569.30 కి పెరిగింది. అంటే పదేళ్లలో ఏకంగా 34,000% వృద్ధిని నమోదు చేసింది. ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. ఇదే స్థాయి పెట్టుబడి కాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్ అనే ఫార్మా కంపెనీలో పెడితే ఇప్పటికి రూ 1.85 కోట్లు అయి ఉండేది. ఇలాంటి కంపెనీలు కనీసం 50 నుంచి 60 ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ కూడా అత్యధిక రాబడిని అందించిన వాటిలో ఒకటిగా ఉండటం విశేషం.
ఎంపిక ముఖ్యం...
స్టాక్ మార్కెట్ అని కాదు కానీ ... భవిష్యత్ లో ఎవరికి ఏం జరుగుతుందో ముందే చెప్పడం కష్టం. కానీ రంగాల వారిగా భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించ వచ్చని స్టాక్ మార్కెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు. అందుకే బలమైన రంగాలను ఎంపిక చేసుకొని, ఆయా రంగాల్లో మెరుగైన, వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో మదుపు చేయాలనీ సూచిస్తున్నారు. ఏ పెట్టుబడి అయినా... దీర్ఘకాలిక లక్ష్యంతో ఉండాలి తప్ప మార్కెట్లు పడిపోతుంటే భయపడి పోయి వెంటనే విక్రయిస్తే లాభాలు రావు సరికదా నష్టాలు మిగులుతాయని హెచ్చరిస్తున్నారు. మార్కెట్లు పడిపోతున్నప్పుడే సరైన కంపెనీల్లో ఇంకా అధికంగా షేర్లు కొనుగోలు చేయాలనీ సూచిస్తున్నారు. అలా అయితేనే మనం ఊహించిన దానికంటే అధిక రాబడిని పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మీరు అవుతారో హీరో?
గత దశాబ్దంలో ప్రొసెస్డ్ ఫుడ్, ఫార్మస్యూటికల్స్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, కన్స్యూమర్ గూడ్స్, పెస్టిసిడ్స్, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఫుట్ వేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు మెరుగైన రాబడులను అందించాయి. మధ్యలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాలు కూడా మెరుగ్గా రాణించాయి. ఇలాగే, 2020 నుంచి 2030 మధ్య కాలంలో ఏ ఏ రంగాలు అత్యధిక రాబడులను అందించగలవో నిపుణులైన స్టాక్ మార్కెట్ అనలిస్టులను సంప్రదించి మీరు కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. ఏమో మీరు కూడా రూ 1 లక్ష, రూ 2 లక్షల పెట్టుబడితో రూ కోటి సంపాదించి హీరో అనిపించుకుంటారేమో. మరెందుకు ఆలస్యం? ఆల్ ది బెస్ట్!