చాలామంది తెలుసుకోవాల్సిన విషయం... పీపీఎఫ్లో ఎలా ఎక్కువ లాభం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) రిస్క్ ఫ్రీ మరియు రిటర్న్ గ్యారంటీ కలిగినది. సెక్షన్ 80సీ కింద ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. పీపీఎఫ్ ఇన్వెస్టర్ రూ.1.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందవచ్చు. బెస్ట్ రిటైర్మెంట్ సాధానాల్లో పీపీఎఫ్ ఒకటి. పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు కొన్ని చిన్న చిన్న సూచనలతో ఎక్కువ రాబడి పొందవచ్చు.
చిన్న ట్రిక్కుతో పీపీఎఫ్ రాబడి పెంచుకోవచ్చు..
చిన్న ట్రిక్కుతో పీపీఎఫ్ రాబడిని పెంచుకునే అవకాశం ఉంది. దీంతో మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడి ఉంటుంది. ప్రతి నెల 5వ తేదీలోపు డబ్బులు పీపీఎఫ్ అకౌంట్లో వేస్తే మరింత లాభం ఉంటుంది. 5వ తేదీ నుంచి నెల చివరి తేదీ వరకు వడ్డీని ఇస్తుంది. కాబట్టి ఓ పెట్టుబడిదారు ప్రతి నెల 5వ తేదీకి ముందు ఇన్వెస్ట్ చేస్తే అంటే 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య పెట్టుబడిపై వడ్డీని పొందవచ్చు.
చాలామందికి తెలియనివాటిల్లో ఇది కూడా ఒకటి...
పీపీఎఫ్ పెట్టుబడి రిస్క్ ఫ్రీ పెట్టుబడి అని, పీపీఎఫ్పై వడ్డీని కేంద్ర ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తోందని, ప్రస్తుతం పీపీఎఫ్పై వడ్డీ రేటు 7.9 శాతంగా ఉందని ట్రాన్సెండ్ కన్సల్టెండ్ వెల్త్ మేనేజ్మెంట్ మేనేజర్ కార్తిక్ అన్నారు. పీపీఎప్లో రూ.1.5 లక్షల పెట్టుబడి వరకు సెక్షన్ 80సీ కింద ఆదాయ పన్ను మినహాయింపు ఉందన్నారు. అయితే ఇవి అందరికీ తెలిసినవేనని, కానీ ఇన్వెస్ట్ చేసేవారికి తెలియనివి కూడా ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఇందులో పీఎఫ్ వడ్డీ రేటు లెక్కింపు ఒకటి అన్నారు. పీఎఫ్ వడ్డీ రేటు గురించి తెలుసుకుంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయన్నారు.
రూ.500 నుంచి రూ.1.50 లక్షల వరకు..
పీపీఎఫ్ ఖాతాను కనీసం రూ.500 మొత్తంతో ప్రారంభించవచ్చునని, రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చునని సెబి రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నిపుణులు మనికరణ్ అన్నారు. గరిష్టంగా 12సార్లు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే 5వ తేదీలోపు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ ఎక్కువ వస్తుందన్నారు.