నంద్యాల వద్ద కాలి బూడిదైన ARBCVR ట్రావెల్స్ బస్సు, ట్రక్కు: ముగ్గురు సజీవదహనం (వీడియో)
రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. గతంలో కర్నూలు వద్ద సంభవించిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. చేవెళ్ల వద్ద టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న దుర్ఘటనల్లో పలువురు దుర్మరణం పాలయ్యారు. సురక్షితంగా గమ్యస్థానం చేరుతామనే గ్యారంటీ ప్రయాణికులకు లేకుండా పోయింది.
ఇప్పుడు తాజాగా నంద్యాల జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని శిరివెళ్లమిట్ట సమీపంలో కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఏఆర్ బీసీవీఆర్ ట్రావెల్స్ కు బస్సు ప్రమాదానికి గురైంది. శిరివెళ్లమిట్ట మీదుగా వెళ్తోన్నప్పుడు బస్సు టైర్ పేలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పింది. కుడివైపు డివైడర్ దాటుకుని దూసుకెళ్లింది. ఎదురుగా వస్తోన్న ఓ కంటైనర్ ట్రక్ ను ఢీ కొట్టింది.

ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఆయనను కడప జిల్లాకు చెందిన భాస్కర్ గా గుర్తించారు. బస్సు ఢీ కొట్టిన వేగానికి కంటైనర్ ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ట్రక్ డ్రైవర్, క్లీనర్ క్యాబిన్లోనే చిక్కుకుపోయారు. బయటకు రాలేక మంటల బారిన పడి, సజీవదహనం అయ్యారు. కంటైనర్ లో ఉన్న కొత్త బైక్స్ మంటల్లో కాలి బూడిద అయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వారందరూ కూడా ప్రాణాలతో బయటపడగలిగారు. 14 మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టుకుని ప్రయాణికులు బయటికి రాగలిగారు. క్లీనర్, ఈ మార్గంలో వెళ్తోన్న ఇతర వాహనదారులు వారికి సహాయం చేశారు. సమాచారం అందిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్, ఆళ్లగడ్డ డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.
Credit: Oneindia


Click it and Unblock the Notifications