భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలు తగ్గించిన ప్రపంచ బ్యాంకు
కరోనా మహమ్మారి తర్వాత, రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, తదనుగుణంగా భారీగా పెరిగిన చమురు ధరల కారణంగా ప్రపంచ దేశాల వృద్ధి రేటు తగ్గుతుందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అంచనా వేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతానికి సవరించింది.
ఈ ఏడాది జనవరిలో 8.7 శాతంగా అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు, ఆ తర్వాత దానిని 8 శాతానికి సవరించింది. తాజాగా 7.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది. జనవరి నాటి అంచనాలతో పోలిస్తే 1.2 శాతం తగ్గింది. 2023-24 ఆర్తిక సంవత్సరంలో వృద్ధి రేటు మరికాస్త తగ్గి 7.1 శాతం నమోదు కావొచ్చునని చెబుతున్నారు. 2021-22లో జీడీపీ వృద్ధి శాతం 8.7 శాతంగా నమోదయింది. అదే సమయంలో ప్రపంచ వృద్ధి రేటు ఈ ఏడాదిలో 2.9 శాతానికి తగ్గవచ్చునని పేర్కొంది.
కరోనా నుండి దేశం క్రమంగా కోలుకుంటున్న సమయంలో, దేశ ఆర్థిక వ్యవస్థకు అధిక ద్రవ్యోల్భణం, సరఫరా ఇబ్బందులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవరోధాలు ఏర్పడవచ్చునని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
2022 ప్రథమార్థంలో కరోనా కేసుల విస్తృతి, ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధ ప్రభావం కారణంగా ద్రవ్యోల్భణం పెరిగింది. తక్కువ వేతనాలు కల ఉద్యోగాలు ఎక్కువగా పెరిగినట్లు తెలిపింది. అయితే ప్రయివేటు రంగం పుంజుకోవడం, వ్యాపార పరిస్థితి మెరుగుపడటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు-సంస్కరణలు వంటివి వృద్ధికి దోహదపడతాయని తెలిపింది.