పొడిగింపే కాదు... పర్మనెంట్ అయ్యేలా ఉంది! వర్క్ ఫ్రమ్ హోమ్పై కంపెనీల మనోభావం
కరోనా వైరస్ వ్యాప్తి తో మన జీవన శైలి లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పని చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి. ఇందులో ఒకటే వర్క్ ఫ్రొం హోమ్. ఒకప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) కి మాత్రమే పరిమితమైన ఈ కాన్సెప్ట్ లాక్ డౌన్ పుణ్యమా అని అన్ని రంగాలకూ విస్తరించింది. కేవలం తయారీ రంగంలో తప్పనిసరిగా ఆఫీస్ కు రావాల్సిన సిబ్బంది మినహా మిగితా అందరూ ఇంటి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు మొదలయ్యాయి.
తొలుత ఇదొక తాత్కాలిక చర్య మాత్రమే అనుకున్నప్పటికీ... ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణ తో ఇకపై వర్క్ ఫ్రొం హోమ్ విధానం పర్మనెంట్ అయ్యేలా ఉందని కంపెనీలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతి విధానంలోనూ ఉన్నట్లే వర్క్ ఫ్రొం హోమ్ లోనూ మంచి, చెడు మిళితమై ఉన్నాయి. అయినా సరే ఇందులో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా కంపెనీలు ఈ విధానానికి జై కొడుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఐటీ కంపెనీల్లో 90 రోజుల్లో 11,000 మంది ఉద్యోగులు ఔట్!
ఉత్పాదకత పెరిగింది...
గతంలో ఆఫీస్ కు వెళ్లి పనిచేసేప్పుడు నిర్ణీత సమయం మాత్రమే పని ఉండేది. ఆఫీస్ నుంచి వచ్చేస్తే ఇక మళ్ళీ మరుసటి రోజు మాత్రమే పని మొదలయ్యేది. వర్కింగ్ డే లోనూ మధ్యలో టి బ్రేక్, లంచ్ బ్రేక్ ఉండేవి. ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు కొంత వెసులుబాటు ఉండేది. కానీ, ఇప్పుడు వర్క్ ఫ్రొం హోమ్ విధానంలో అవేమీ కుదరటం లేదు. ఒక నిర్ణీత సమయం అంటూ ఏమీ లేకుండా ఎప్పుడైనా పనిచెబుతున్నారు. పని పూర్తయ్యేంత వరకు పని చేస్తూనే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సాధారణం కంటే కనీసం 20-25% అధిక పని గంటలు పనిచేస్తున్నారు ఉద్యోగులు. ఈ విధానంతో ఉద్యోగుల ఉత్పాదకత గణనీయంగా పెరిగిపోయింది. కాబట్టి కంపెనీలకు ఇదొక అద్భుతమైన అవకాశం లా కనిపిస్తోంది. దీంతో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రొం హోమ్ ను పొడిగిస్తూ పోతున్నాయి.
గూగుల్ నుంచి ఫిలిప్స్ వరకు...
ఇండియా విషయానికి వస్తే... వర్క్ ఫ్రొం హోమ్ విధానానికి అధిక ప్రాధాన్యమిస్తూ దానిని మరింత కాలం పొడిగించిన కంపెనీల్లో టెక్ దిగ్గజాల నుంచి తయారీ సంస్థల వరకు అందరిదీ ఒకే పాలసీ లా కనిపిస్తోంది. గూగుల్, అమెజాన్, సిటీ బ్యాంకు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, హెచ్ యూ ఎల్, కేపీఎంజీ, ఆర్ఫీజి గ్రూప్, కాగ్నిజెంట్, ఫిలిప్స్, పిడిలైట్ వంటి కంపెనీలు వర్క్ ఫ్రొం విధానానికి జై కొడుతున్నాయి. గూగుల్ అయితే ఏకంగా 2021 జూన్ 30 వరకు మెజారిటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని పొడిగించింది. అలాగే అమెజాన్ కూడా దీనిని ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2021 జూన్ వరకు పొడిగించింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. కేపీఎంజీ అయితే కేవలం 5% మంది ఉద్యోగులను మాత్రమే కార్యాలయానికి రావాలని, మిగితా వారంతా వర్క్ ఫ్రొం హోమ్ విధానంలో పనిచేయాలని సూచిస్తోంది.
అందుకే ఇలా..
ఐటీ కంపెనీలు కాకుండా తయారీ రంగంలో ఉన్న ఫిలిప్స్ లాంటి కంపెనీలు సైతం ఈ విధానానికి జై కొడుతుండటం విశేషం. కేవలం 15% మందిని మాత్రమే ఆఫీస్ కు వచ్చి పని చేసేందుకు అనుమతిస్తోంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ -19 తీవ్రత అధికంగా ఉండటంతో ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఈ చర్యలకు ప్రాధాన్యమిస్తున్నాయి. వారు ఇంటి నుంచి పనిచేసినా ప్రొడక్టివిటీ అధికంగా ఉండటంతో అదే వారికి శ్రీ రామ రక్ష లా ఉంటుందని కంపెనీల విశ్వాసం. ఎక్కువ మంది ఆఫీస్ కు వచ్చి పనిచేస్తే వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వర్క్ ఫ్రొం హోమ్ మాత్రమే బెటర్ అని భావిస్తున్నాయి. ఒకవైపు కోవిడ్ -19 రాకుండా చూసుకుంటూనే, మరో వైపు బిజినెస్ దెబ్బతినకుండా పనిచేసేందుకు ఈ విధానం చాలా మెరుగ్గా ఉండటం వల్ల ఇక మీదట దీనిని పర్మనెంట్ చేయాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నాయి.