Wipro News: ఇక జీతాల్లో బేరాలు లేవమ్మా.. టెక్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్..!!
Wipro News: రోజులు గడిచే కొద్ది ఐటీ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టెక్నాలజీ మార్పులతో పాటు వారుతున్న అవసరాలు, వ్యాపారంలో పోటీ, గ్లోబల్ ఎకనమిక్ స్థితిగతులు ఉద్యోగులపై ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఈ క్రమంలో టెక్కీల ఆశలు నిరాశలౌతున్నాయి. అసలే కొనసాగుతున్న లేఆఫ్ గడ్డు కాలం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి కొత్త సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా దేశీయ ఐటీ కంపెనీ విప్రో ప్రతినిధి చెప్పిన విషయాలు ఐటీ రంగం భవిష్యత్తు పరిస్థితులపై టెక్కీలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. పైగా వరుసగా గత కొంత కాలంగా విప్రో నుంచి వస్తున్న ప్రకటనలు వాస్తవ పరిస్థితులకు అద్ధం పట్టేవిగా ఉంటున్నాయి.

ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మందగమనం, నియామకాలు తక్కువగా ఉన్న వాతావరణంలో ఐటీ నిపుణులు నైపుణ్యం పెంపుపై ప్రధానంగా తమ దృష్టి పెంచుకోవాలని విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐటీ పరిశ్రమలో జీతాలు sanity స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. అందువల్ల భవిష్యత్తులో టెక్కీల జీతాల పెంపులు కేవలం వారి వ్యక్తిగత నైపుణ్యాల పెంపుపైనే ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.
గతంలో మాదిరిగా జీతాల పెంపుల కోసం అనేక కంపెనీలు మారటం కుదరకపోవచ్చని తెలుస్తోంది. అయితే 2021 కరోనా మహమ్మారి సమయంలో డిమాండ్ పెరగటం, అధిక అట్రిషన్ రేటు వంటి కారణాల వల్ల టెక్కీలకు అనేక అవకాశాలు దొరికాయని గోవిల్ తెలిపారు. అందువల్ల కంపెనీలు తమ అవసరాల కోసం నియామకాల్లో 30 శాతం జీతాల పెంపు ఆఫర్ చేసి నియామకాలు చేసుకున్నాయి. అయితే ఇది ఇకపై జరగదని.. కేవలం నైపుణ్యాలే జీతాల పెంపును నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మార్కెట్లో జనరేటివ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి నూతన టెక్నాలజీ స్కిల్స్ కలిగిన టెక్కీలకు సముచిత జీతాల పెంపు ఆఫర్లు ఐటీ పరిశ్రమ అందిస్తోందని గోవిల్ పేర్కొన్నారు. ఇదంతా చూస్తుంటే మ్యాటర్ ఉంటేనే మనీ ఇస్తామని ఐటీ పరిశ్రమ వర్గాలు చెప్పకనే చెబుతున్నట్లు కనిపిస్తోంది. అయితే దీనిపై టెక్కీలు ఆందోళన చెందుతుండగా.. కొత్త వారికి మాత్రం మార్గనిర్ధేశకంగా నిలువనుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications