క్రిప్టోపై పన్ను హక్కు, నిషేధించాలా వద్దా నిర్ణయిస్తాం: నిర్మలా సీతారామన్
క్రిప్టో కరెన్సీ పైన నిషేధం విధిస్తామా లేదా అన్న విషయం తర్వాత వెల్లడిస్తామని, క్రిప్టో పైన పన్ను విధింపు సార్వభౌమ హక్కు అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. కానీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన రాజ్యసభలో శుక్రవారం జరిగిన చర్చకు, ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె క్రిప్టో పన్ను అంశాన్ని ప్రస్తావించారు. క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చే లాభాలపై మాత్రమే పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. దీనిని చట్టబద్ధం లేదా నిషేధించడానికి ఏం చేయలేదన్నారు
నిపుణులతో సంప్రదింపులు
క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చట్టబద్దమా కాదా అన్న ప్రశ్న తర్వాత అని, ఈ ట్రాన్సాక్షన్స్ ద్వారా పొందే లాభాలపై మాత్రం పన్ను విధిస్తామని నిర్మల తెలిపారు. ఎందుకంటే అది ప్రభుత్వానికి ఉండే సార్వభౌమ హక్కు అన్నారు. క్రిప్టో కరెన్సీపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారి నుండి అభిప్రాయాలు సేకరించాక నిషేధించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం దానిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని తెలిపారు.
పాతికేళ్ల ప్రణాళిక
ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన పునరుద్ధరణ లక్ష్యంగా 2022-23 బడ్జెట్ను రూపొందించినట్లు నిర్మలమ్మ తెలిపారు. వందేళ్ల స్వాతంత్ర్య భారత్ను దృష్టిలో పెట్టుకొని రానున్న పాతికేళ్లకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ పాతికేళ్లు దేశానికి చాలా ముఖ్యమన్నారు. వాటిపై దృష్టి పెట్టకపోతే స్వాతంత్ర్యం వచ్చిన తొలి ఏడు దశాబ్దాల్లో ఎలా ఇబ్బందులు పడ్డామో అలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
పన్ను విధింపు
ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రయివేటు క్రిప్టో ట్రాన్సాక్షన్స్, లాభాలపై 30 శాతం పన్నును విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2022-23 బడ్జెట్లో ఒక ఏడాదిలో రూ.10,000 కంటే ఎక్కువ వర్చువల్ కరెన్సీలకు చెల్లింపులపై 1 శాతం టీడీఎస్ ఉంటుంది.