బాడ్ న్యూస్: మూత పడుతున్న బంగారం షాపులు. ఎందుకో తెలుసా?
భారతీయులకు బంగారానికి విడదీయలేని సంబంధం ఉంటుంది. ఎంత పేదవాడైనా సరే ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంది తీరాల్సిందే. అందుకే ప్రపంచంలోనే అత్యంత అధిక మొత్తంలో బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఏటా ఇక్కడ వందల కొద్దీ టన్నుల బంగారం విక్రయమవుతుంది. తరాలుగా వస్తున్నఈ ఆచారం, అలవాటులో పెద్దగా మార్పులేమీ రాలేదు. కానీ బంగారం విక్రయించే విధానంలో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల చిన్న చిన్న బంగారం షాపులు మూతపడటం మొదలైంది. ఈ షాపులకు వినియోగదారుల రాక తగ్గటమే ఒక ప్రధాన కారణం కాగా.. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, డిజిటల్ చెల్లింపులు, బంగారంపై దిగుమతి సుంకం పెంపు వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. చిరు వ్యాపారులకు రుణాల లభ్యత కూడా తగ్గిపోయింది. దీంతో వందల ఏళ్లుగా కుటుంబ వ్యాపారంగా నిర్వహిస్తున్న బంగారం రిటైల్ షాపులు ఇప్పుడు మూసివేయక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ అంశంపై ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. అందులోని అంశాల ఆధారంగా మీకోసం ఈ కథనం.
బంగారంపై రుణం తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాటు చేయకండి!
వెరైటీ కోరుతున్న మిలీనీయల్స్...
ఈ తరం యువత అన్నీ కొత్తగా ఉండాలని కోరుతోంది. డిజైన్ల లో వైవిధ్యం, ఎక్కువ రకాల డిజైన్లు, ధరలో పారదర్శకత, ఒరిజినల్ బిల్స్, హాల్ మార్క్ సర్టిఫికేషన్, బై బ్యాక్ గారంటీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. పైగా షాపింగ్ చేసే ప్రదేశం పెద్దదిగా, అందంగా ఉండాలని కోరుకుంటోంది. అందుకే ఈ తరం వినియోగదారుల బాట పెద్ద పెద్ద గొలుసుకట్టు బంగారం షాపులు ... కాదు కాదు బంగారం మాల్స్ కు అడుగులువేస్తోంది. మలబార్ గోల్డ్, తనిష్క్, కళ్యాణ్ జ్యువెల్లర్స్, ఖజానా, లలితా జ్యువెల్లర్స్ వంటి షోరూం లకు గిరాకీ పెరుగుతోంది. సీఎంఆర్, ఆర్ ఎస్ బ్రదర్స్, చందనా బ్రదర్స్ వంటి స్థానిక రిటైలర్లు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. తమ షాపింగ్ మాల్స్ లో బంగారం కోసమే ప్రత్యేక ఫ్లోర్ ను కేటాయిస్తున్నారు. ఇక్కడ వేళ కొద్దీ డిజైన్లు, బంగారంతో పాటు, ప్లాటినం, డైమండ్, రోడియం వంటి అనేక రకాల ప్రత్యామ్నాయ జెవెలెరీ కూడా అందుబాటులో ఉంటుంది. పక్కా బిల్, హాల్ మార్క్ సర్టిఫికేషన్, బై బ్యాక్, డిజిటల్ పేమెంట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటాయి. దీంతో మిల్లీనియల్స్ బ్రాండెడ్ గోల్డ్ షోరూం లేక్ జై కొడుతున్నారు.
రూ 3 లక్షల కోట్ల మార్కెట్...
భారత బంగారం మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్దది. మన దేశం ఏటా సుమారు 800 టన్నుల నుంచి 900 టన్నుల వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. మొత్తంగా భారత గోల్డ్ మార్కెట్ పరిమాణం రూ 3,00,000 కోట్లు ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. అయితే, మన దేశంలో బంగారం రిటైల్ వ్యాపారం ఎక్కువగా అసంఘటిత రంగంలో జరిగేది. ఆర్గనైజ్డ్ రిటైల్ వ్యాపారం చాలా తక్కువగా ఉండేది. కొంత కాలంగా పరిస్థితుల్లో మార్పు వస్తోంది. 2005 లో కేవలం 5% మాత్రమే ఉన్న ఆర్గనైజ్డ్ రిటైల్ వ్యాపారం .. 2015 నాటికి 30% కి పెరిగింది. 2020 నాటికి ఇది కాస్త 45% మేరకు పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీనంతటికీ కారణం మాత్రం వినియోగదారుల కొనుగోలు అభిరుచుల్లో వస్తున్న మార్పులేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పెద్దవి పెరుగుతున్నాయి...
దేశంలో 25 ఏళ్ళ వయసు ఉన్న యువత మొత్తం జనాభాలో సుమారు 45% మేరకు ఉంటోంది. వీరికి త్వరగా ఉద్యోగాలు రావటం, మెరుగైన వేతనాలు లభిస్తుండటంతో గోల్డ్ జ్యువెలరీ కొనుగోళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడి తో పాటు తమ ప్రేమను చాటేందుకు కూడా గోల్డ్ జ్యువలరీ ని ఒక సాధనంగా వాడుతున్నారు. అందుకే వీరంతా డిఫరెంట్ ప్రోడక్ట్ రేంజ్ ను అందించే భారీ రిటైల్ గోల్డ్ షోరూమ్స్ల లో షాపింగ్ చేస్తున్నారు. కార్డు పేమెంట్ సదుపాయం అందుబాటులో ఉండటం కూడా ఇందుకు ఒక కారణమే. ఈ ట్రెండ్ కు అనుగుణంగా పెద్ద రిటైలర్లను తమ షోరూం లను విస్తరిస్తున్నారు. గత ఐదేళ్లలో మలబారు గోల్డ్ 42% స్టోర్ల సంఖ్య పెంచగా... కళ్యాణ్ జెవెల్లెర్స్ తమ స్టోర్ల ను 51 నుంచి 105 కు పెంచింది. లలితా జెవెల్లెర్స్ తో పాటు మిగితా రిటైల్ చైన్లు కూడా ఇదే దారిలో పయనిస్తున్నాయి.
ఇతర వ్యాపారాల్లోకి చిన్న వర్తకులు...
మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా లేక పోవటంతో చిన్న లేదా సంప్రదాయ బంగారం వర్తకులు చితికి పోతున్నారు. అలాగని షాపులను విస్తరించేందుకు తగిన మూలధనం అందుబాటులో లేదు. అందుకే తరాలుగా వస్తున్నవ్యాపారాన్ని వదిలేసి, కొత్త వ్యాపారాల్లోకి వెళ్లిపోతున్నారు. డిజిటల్ పేమెంట్ విధానం అమలు చేయక పోవటం, పక్కా బిల్స్ ఇవ్వలేకపోవటం, హాల్ మార్క్ సర్టిఫికేషన్ ఉన్న డిజైన్స్ విక్రయించక పోవటంతో పాటు జీఎస్టీ చెల్లింపులు, దిగుమతి సుంకాలు భారంగా మారటంతో ఇక చేసేది లేక బిజినెస్ వదిలేస్తున్నారు. ఇలా చెన్నై కి చెందిన ఒక వ్యాపారి చేపల విక్రయం లోకి ప్రవేశించగా, మరో చిరు వ్యాపారి ఇదే రంగంలో నగల సరఫరాదారుగా కొత్త అవతారం ఎత్తారని ఈటీ తన కథనంలో ప్రస్తావించింది. మరికొంత మంది ఇతరత్రా వ్యాపారాలకు మళ్లుతున్నారని, వారి వారసులు మాత్రం ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.