న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒప్పందాల కోసం భారతదేశ వాణిజ్య ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో పణంగా పెట్టే ప్రసక్తి లేదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. మన దేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (RCEP) ఒప్పందంలో తాము చేరే ప్రసక్తి లేదని అదే సదస్సులో మోడీ తేల్చి చెప్పారు. వాణిజ్యంలో ఈ దేశాలతో ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనలు పరిష్కారం కాకుండా RCEP ఒప్పందంలో చేరేది లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా కీలక నిర్ణయం తీసుకున్నారు.

మేం చేరలేకపోతున్నాం... మోడీ
RCEP ప్రస్తుత ఒప్పందం గతంలో అంగీకరించిన ప్రాథమిక స్ఫూర్తి, మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా లేదని, ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనల్ని కూడా ఈ ఒప్పందం సంతృప్తికరంగా పరిష్కరించేలా లేదని, ఈ నేపథ్యంలో RCEPలో తాము చేరలేమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు సంతృప్తికర సమాధానాలను ఇవ్వలేకపోతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒప్పందంలో చేరడం భారత్కు సాధ్యం కాదన్నారు. మహాత్మా గాంధీ సూత్రీకరించిన తులాదండం ప్రకారం చూసినా, తన అంతరాత్మ ప్రభోదానుసారమైనా RCEPలో చేరలేకపోతున్నామన్నారు.

2004 నుంచి 2014 వరకు 11 రెట్లు పెరిగిన వాణిజ్య లోటు
ఆసియాన్లోని 10 దేశాలతో భారత్కు ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTA) ఉన్నాయి. ఈ ఒప్పందాల వల్ల భారత్ కంటే ఆసియాన్ దేశాలే ఎక్కువగా ప్రయోజనం పొందాయి. ఈ దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు అంతమాత్రమే పెరిగాయి. ఈ దేశాలు మాత్రం భారత్కు తమ ఉత్పత్తులను గణనీయంగా పెంచాయి. 2004లో RCEP దేశాలతో 700 కోట్ల డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2014 నాటికి 7,800 కోట్ల డాలర్లకు చేరుకోవడం గమనార్హం.

భారత పరిశ్రమ, వ్యవసాయానికి దెబ్బ
ఇక, ఇప్పటి RCEP ఒప్పందం కింద ఈ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు 90% వరకు తగ్గించాలి. అలా చేస్తే భారత పరిశ్రమ, వ్యవసాయం కుదేలు అవుతుంది. దీనికి తోడు RCEP ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు తమ పాడి ఉత్పత్తులను భారత్లో డంప్ చేసే ప్రమాదం ఉందని దేశీయ పాడి పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. మోడీ కూడా వీటన్నింటిని బేరీజు వేసుకొని, భారత్కు ఏమాత్రం ప్రయోజనం కానీ RCEP చేరేది లేదని కుండబద్దలు కొట్టారు. తాము లేవనెత్తిన కీలక అంశాలను అపరిష్కృతంగా వదిలేయడంతో భారీ వాణిజ్య ఒప్పందంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఎన్నో మార్పులు వచ్చాయి..
అంతర్జాతీయ నియమ నిబంధనలకు, విస్తృత ప్రాంతీయ సమగ్రతకు, స్వేచ్ఛా వాణిజ్యానికి భారత్ వెన్నుదన్నుగా నిలుస్తోందని, ఆవిర్భవించినప్పటి నుంచి RCEP చర్చల్లో క్రియాశీలకంగా, నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా భారత్ పాల్గొంటూ వచ్చిందని, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే స్ఫూర్తితో సమతౌల్యాన్ని సాధఇంచాలనే లక్ష్యం కోసం పని చేశామని, ఏడేళ్ల చర్చల తర్వాత ఈ రోజు ఓసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రపంచ ఆర్థిక, వాణిజ్య రంగాలు సహా ఎన్నో మారిపోయాయని, ఈ మార్పులను మనం విస్మరించలేమని మోడీ తేల్చి చెప్పారు. భారతీయుల ప్రయోజనాల దృష్ట్యా RCEP ఒప్పందాన్ని బేరీజు వేసుకుంటే తమకు సానుకూల సమాధానం రావడం లేదన్నారు.

వచ్చే ఏడాది మిగతా దేశాల మధ్య ఒప్పందం..
RCEP నుంచి భారత్ వైదొలిగిన అనంతరం మిగతా పదిహేను దేశాల నేతలు ఓ ప్రకటన విడుదల చేసారు. వచ్చే ఏడాది RCEP ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తీర్మానించినట్లు చెప్పారు. అపరిష్కృతంగా ఉన్న విషయాల్ని కొలిక్కి తెచ్చేందుకు తాము కలిసి పని చేస్తామని, వీటిని సంతృప్తికరంగా పరిష్కరించడంపై భారత్ తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని మిగిలిన దేశాలు పేర్కొన్నాయి. భారత్ చేరికపై తమకు ఆశలు ఉన్నట్లుగా చెప్పకనే చెప్పాయి.

చేరకపోవడానికి కారణాలు..
- వాణిజ్య లోటు భర్తీని తీర్చేందుకు, ధరల మధ్య వ్యత్యాసానికి తగిన పరిష్కారం లభించకపోవడం.
- వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులు వెల్లువెత్తే ప్రమాదం.
- దాదాపు 90% వస్తువులపై దిగుమతి సుంకాలు ఎత్తివేసేలా ఒప్పందం ఉండటం.
- అత్యంత ప్రాధాన్య దేశాల హోదాను మరిన్ని దేశాలకు ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇది భారత్కు ఇబ్బందికరం.
- టారిఫ్ తగ్గింపులకు ప్రాతిపదిక ఏడాదిగా 2014ని పరిగణించాలని చెప్పడం. ఈ ఏడేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయని ప్రధాని మోడీ సూటిగా చెప్పారు.
- దిగుమతుల వెల్లువ నుంచి రక్షణ కల్పించడం, ఎగుమతులకు విశ్వసనీయత భరోసా వంటి అంశాలేవీ పరిష్కారం కాకపోవడంతో కూటమికి నో చెప్పారు.
- ఈ ఒప్పందంపై సంతకం చేస్తే చైనా నుంచి చౌక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు భారత్ పెద్ద ఎత్తిన వస్తాయి. దీనివల్ల దేశీయ మార్కెట్ కుదేలు అవుతుంది. అందుకే అందరికీ అర్థవంతమైన మార్కెట్ అవకాశాలు ఉండాలని, దేశీయ ఉత్పత్తులకు రక్షణలు పొందుపరచాలని భారత్ డిమాండ్ చేస్తోంది.

అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో...
అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని అడ్డుకునేందుకు వీలుగా ప్రస్తుత సదస్సులో RCEP ఒప్పందం ఖరారు అయ్యేలా చూడాలని చైనా ఒత్తిడి తీసుకు వచ్చిందనే వాదనలు ఉన్నాయి. ప్రాంతీయ ఆర్థిక బలాన్ని పశ్చిమ దేశాలకు చాటాలనేది చైనా ప్రయత్నంగా భావిస్తున్నారు. 2012లోనే RCEP చర్యలను ప్రారంభించారు.

చైనాతో ఇక్కట్లు..
RCEP ఒప్పందానికి భారత్ నో చెప్పడానికి అసలు కారణం, చైనా వస్తువుల డంపింగ్ ప్రమాదమేనని కూడా భావిస్తున్నారు. ఎలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేకున్నప్పటికీ చైనా ఇప్పటికే అనేక వస్తువుల్ని భారత్లోకి కుమ్మరిస్తోంది. అదే సమయంలో మన వస్తువులు డ్రాగన్ మార్కెట్లోకి వెళ్లకుండా ఏదోలా అడ్డు తగులుతోంది. దీంతో ద్వైపాక్షిక వాణిజ్య లోటు భారీగా పెరుగుతోంది. దీనికి RCEP తోడయితే దేశీయ పరిశ్రమలకు రక్షణ కూడా ఉండదని మోడీ ప్రభుత్వం భావించింది. భారత పరిశ్రమలు కూడా ఆందోళన వ్యక్తం చేసాయి. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందానికి మోడీ ప్రభుత్వం దూరంగా ఉంది.

ఏమిటీ RCEP?
రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ను షార్ట్గా RCEPగా చెప్తున్నారు. చైనా దన్నుతో ప్రతిపాదించిన 16 దేశాల మధ్య ట్రేడ్ డీల్ కూటమి ఇది. ఇందులో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషనల్స్ (ఆసియాన్) దేశాలతో పాటు మరో ఆరు ఉన్నాయి. ఆసియాన్ దేశాలు... బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్సీన్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం ఉన్నాయి. అలాగే, వీటితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న (FTA) ఆరు దేశాలు (భారత్, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఇందులో చేరకూడదని భారత్ తాజాగా నిర్ణయించింది.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోదీ.. భారత్కు తీవ్ర ఆందోళన కలిగించే అంశమంటూ..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

మిత్రుడిని అమెరికా చంపేస్తుంటే మౌనంగా చూస్తుండిపోయిన చైనా.. సైలెంట్ వెనక మిస్టరీ ఇదే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..



Click it and Unblock the Notifications