వెండి ధరల వ్యత్యాసంపై షాకింగ్ న్యూస్.. చైనా కన్నా భారత్లోనే Silver ధరలు చాలా తక్కువ..కారణమిదే..
అంతర్జాతీయంగా వెండి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. ధరలు ఒక్కసారిగా పెరగడం వెంటనే కుప్పకూలడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో వివిధ దేశాల్లో ధరల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్, చైనాలో వెండి ధరల మధ్య చాలా తేడా ఉందని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఈరోజు 3 శాతానికి పైగా పెరిగి ఔన్సుకు 109 డాలర్ల పైన ట్రేడవుతోంది. 2026లో ఇప్పటివరకు దాదాపు 44 శాతం పెరిగింది. గత 12 నెలల్లో అయితే వెండి ధరలు 250 శాతానికి పైగా ఎగబాకడం మార్కెట్లో అసాధారణమైన ఉత్సాహాన్ని సూచిస్తోంది.
అయితే చైనాలో మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అక్కడ వెండి అంతర్జాతీయ ధరల కంటే భారీ ప్రీమియంతో ట్రేడవుతోంది. స్థానిక డిమాండ్, సరఫరా ఆందోళనలు, విధాన నిర్ణయాల ప్రభావంతో చైనాలో వెండి ధరలు ఔన్సుకు సుమారు 125 డాలర్ల వరకు చేరాయి. దీనిని భారతీయ రూపాయలలోకి మార్చుకుంటే (డాలర్కు రూ.91.6 మారకం రేటుతో).. చైనాలో ఒక ఔన్స్ వెండి ధర దాదాపు రూ.11,450కు చేరుతుంది.

అయితే భారతదేశంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఈరోజు దేశీయ మార్కెట్లో వెండి ధర 1 గ్రాముకు సుమారు రూ.3.35గా ఉంది. ఒక ఔన్స్ అంటే దాదాపు 28.3 గ్రాములు కావడంతో, భారత్లో ఒక ఔన్స్ వెండి ధర సుమారు రూ.9,984కి సమానం. అంటే చైనాతో పోలిస్తే భారత్లో Silver ధర దాదాపు రూ.1,900 నుంచి 2 వేల వరకు తక్కువగా ఉంది. శాతంగా చూస్తే ఇది సుమారు 17 శాతం తేడాను సూచిస్తోంది.
ఈ భారీ ధరల వ్యత్యాసానికి ప్రధాన కారణం చైనాలో పెరుగుతున్న డిమాండ్తో పాటు అక్కడి ప్రభుత్వ విధానాలు అని చెప్పవచ్చు. ప్రపంచ Silver సరఫరాలో చైనా వాటా 65 శాతానికి పైగా ఉంది. వెండి ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న చైనా.. వెండి ఫ్యూచర్స్, భౌతిక పెట్టుబడులు, పారిశ్రామిక వినియోగంలో కూడా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో, చైనా ప్రభుత్వం 2026 నుండి వెండి ఎగుమతులపై కఠిన నియంత్రణలు విధించాలని నిర్ణయించింది.
జనవరి 1, 2026 నుండి చైనా వెండి ఎగుమతిదారులు తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు పొందాల్సి ఉంటుంది. ఈ లైసెన్సులు కఠినమైన ఆర్థిక, ఉత్పత్తి ప్రమాణాలు కలిగిన పెద్ద, రాష్ట్ర మద్దతు ఉన్న సంస్థలకు మాత్రమే మంజూరు చేయనున్నారు. దీంతో చిన్న ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ విధానం ప్రపంచ మార్కెట్లో చైనీస్ వెండి లభ్యతను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటికే ప్రపంచ వెండి మార్కెట్ గత ఐదు సంవత్సరాలుగా నిర్మాణాత్మక లోటును ఎదుర్కొంటోందని సిల్వర్ ఇన్స్టిట్యూట్ పేర్కొంటోంది. డిమాండ్ నిరంతరం సరఫరాను మించిపోతూనే ఉంది. ఈ పరిస్థితిలో చైనా ఎగుమతి పరిమితులు విధించడంతో ధరలపై మరింత ఒత్తిడి ఏర్పడింది. ఈ ఆందోళనలను టెక్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కూడా ప్రస్తావించారు.ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియల్లో వెండి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన Xలో వ్యాఖ్యానించారు.
ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే.. చంద్ర నూతన సంవత్సర సెలవులు. ఫిబ్రవరి 17, 2026 నుంచి ప్రారంభమయ్యే ఈ సెలవులు సుమారు వారం పాటు కొనసాగుతాయి. ఈ సమయంలో చైనాలో ఫ్యాక్టరీలు, మార్కెట్లు మూసివేయడం జరుగుతుంది. సాధారణంగా ఈ పండుగకు ముందు వెండిని నిల్వ చేసుకునే ధోరణి పెరుగుతుంది. ఇది డిమాండ్ను మరింత పెంచుతుంది. ప్రస్తుతం షాంఘై మార్కెట్లో తక్కువ నిల్వలు, అధిక ప్రీమియంలు కనిపించడంతో, ఈ ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ఏదేమైనా చైనాలో వెండి ధరలు ప్రపంచ మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. అయితే ఇంత వేగంగా పెరిగిన ధరలు ఎక్కువకాలం నిలకడగా ఉండకపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications


