భారత్ కొత్త డిజిటల్ రూల్స్ పైన గూగుల్ సుందర్ పిచాయ్ ఏమ్నారంటే?
ఏ దేశమైనా స్థానిక చట్టాలకు తమ గూగుల్ సంస్థ కట్టుబడి ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవలంభించే రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. భారత్లో బుధవారం నుండి కొత్త ఐటీ నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ అంశంపై పిచాయ్ స్పందించారు. తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి దేశంలో అక్కడి చట్టాలను సంపూర్ణంగా గౌరవిస్తామన్నారు.
తాము నిర్మాణాత్మకగా పని చేస్తామని, తమ నివేదికలు పారదర్శకంగా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ అభ్యర్థనలకు అనుగుణంగా చేసే మార్పులను ఆ నివేదికల్లో పొందుపరుస్తామన్నారు. స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ భారత్లో సుదీర్ఘంగా ఉన్న సంప్రదాయమని, ఒక కంపెనీగా ఆ స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ విలువలు, వాటి ప్రయోజనాల గురించి తమకు తెలుసునని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏ నియంత్రణ సంస్థలతో అయినా తాము కలిసి పని చేస్తామని, సహకారం అందిస్తామన్నారు.

న్యాయపరమైన ప్రక్రియలు, విధానాలపై తమకు గౌరవముందని, అందుకే ప్రభుత్వాల రెగ్యులేటరీ విధానాలకు తాము పూర్తిగా కట్టుబడి ఉంటామని చెప్పారు. యూరప్లో కాపీరైట్ ఆదేశాలు కావొచ్చు, భారత్లో డిజిటల్ కంటెంట్ నియంత్రణ కావొచ్చు... తాము ఒకేలా చూస్తామన్నారు. వాటిని ఎలా పాటించాలనే దాని గురించి పరిశీలిస్తామన్నారు.


Click it and Unblock the Notifications


