తెలంగాణలో యూరియా ప్లాంట్ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తోన్నారు. ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొన్నింటిని ప్రారంభించారు. ఇఫ్కో నెలకొల్పిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంట్ను ప్రారంభించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి..
ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎరువుల బ్లాక్ మార్కెట్ను అరికట్టామని చెప్పారు. విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకునే దుస్థితిని తప్పించామని వివరించారు. ఒక్కో 50 కేజీల ఎరువుల బస్తాను 3,500 రూపాయలు పెట్టి దిగుమతి చేసుకుని, 300 రూపాయలకు రైతులకు ఇవ్వాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ప్రభుత్వం మీద 3,200 రూపాయల భారం పడేదని పేర్కొన్నారు.
పాల ఉత్పత్తిలో..
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏనాడు కూడా దాన్ని భారంగా భావించలేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. పాల ఉత్పత్తిలో భారత్- ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగిందని, ఇందులో గుజరాత్ వాటా అధికమని చెప్పారు. గత ఏడాది కాలంలో పాల ఉత్పాదక రంగం శరవేగంగా పురోగమిస్తోందని అన్నారు. దీనివల్ల గ్రామీణ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరుగుతోందని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డెయిరీ సెక్టార్ మూలస్తంభంలా మారిందని మోడీ అన్నారు.
రోజూ రూ.8 లక్షల కోట్ల వ్యాపారం..
ప్రస్తుతం దేశంలో ప్రతిరోజూ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పాల ఉత్పత్తి నమోదవుతోందని ప్రధాని మోడీ చెప్పారు. దేశంలో అతిపెద్ద మార్కెట్ గోధుమలు, బియ్యాన్ని కలుపుకొన్నప్పటికీ.. పాల ఉత్పత్తికి సరితూగట్లేదని అన్నారు. పాల ఉత్పాదక రంగాన్ని సహకార సెక్టార్తో లింక్ చేయడం వల్ల గుజరాత్లోని గ్రామాలు క్షీర విప్లవాన్ని నమోదు చేశాయని ఆయన పేర్కొన్నారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వందశాతం నీమ్ కోటింగ్ గల యూరియాను రైతులకు అందజేస్తోందని గుర్తు చేశారు.
మూతపడ్డ యూరియా ప్లాంట్లను తెరిపించాం..
పలు రాష్ట్రాల్లో మూతపడిన యూరియా తయారీ కర్మాగారాలను తామే పునరుద్ధరించామని ప్రధాని మోడీ చెప్పారు. తెలంగాణ సహా ఉత్తర ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశాల్లో మూత పడ్డ ఎరువుల తయారీ ఫ్యాక్టరీలను తెరిపించామని పేర్కొన్నారు. ఈ అయిదింట్లో తెలంగాణ, ఉత్తర ప్రదేశ్లల్లోని యూరియా తయారీ ఫ్యాక్టరీలు పని చేయడం ప్రారంభించాయని, మిగిలిన రాష్ట్రాల్లోనివి త్వరలోనే తమ కార్యకలాపాలను ఆరంభిస్తాయని చెప్పారు.
ఫర్టిలైజర్ల ఉత్పత్తిలో..
ఫర్టిలైజర్ల వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానం, ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఏడెనిమిదేళ్ల కిందట యూరియా రైతులకు అందేది కాదని, బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్లేదని ఆయన పరోక్షంగా యూపీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత యూరియా బ్లాక్ మార్కెట్కు చెక్ పెట్టామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందిపుచ్చుకోకపోవడం వల్ల యూరియా తయారీ ప్లాంట్లు మూతపడ్డాయని వ్యాఖ్యానించారు.