వాల్మార్ట్లో ఉద్యోగాల కోత: మూడో వంతు టాప్ ఎగ్జిక్యూటివ్స్కు గుడ్ బై!
ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ కంపెనీ ఐన అమెరికా దిగ్గజం వాల్మార్ట్... ఇండియా లో మాత్రం నష్టాలను చవిచూస్తోంది. పైగా దేశంలో ఆర్థిక మందగమనం ముసురుకుంటున్న సమయంలో ఇబ్బందులు మరింత అధికమయ్యాయి. దీంతో ఇండియా లో కొంత మంది తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఉన్నతోద్యోగుల్లో సుమారు మూడో వంతు మందికి గుడ్ బై చెబుతోంది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. వీరంతా కూడా కంపెనీ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఐన గుర్గాన్ కేంద్రంగా పనిచేసున్నవారే కావటం గమనార్హం.
సోర్సింగ్, అగ్రి బిజినెస్, ఎఫ్ ఎం సి జి విభాగాల్లోని వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులను తొలగిస్తోంది. సుమారు 100 మంది సీనియర్ ఉద్యోగులను కంపెనీ తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిందని ఈటీ తన కథనంలో పేర్కొంది. ఇండియా లో కార్యకలాపాలు ప్రారంభించి 10 ఏళ్ళు దాటుతున్నా... కంపెనీ కి ఆశించిన రాబడి ఇక్కడ సమకూరటం లేదు. పైగా నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ కారణాలతోనే వాల్మార్ట్ మరిన్ని తీవ్ర నిర్ణయాలను తీసుకుంటున్నట్లు కంపెనీ వర్గాల సమాచారం.
చైనా కంపెనీల ముందు చేతులెత్తేసిన శాంసంగ్! టాప్ ఉద్యోగులు సహా వందల ఉద్యోగాల కోత?
ముంబై ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ మూసివేత...
నష్టనివారణ చర్యల్లో భాగంగా వాల్మార్ట్ ముంబై లోని ఒక ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ ను మూసివేస్తున్నట్లు తెలిసింది. వాల్మార్ట్ కు ఇండియా లో ఉన్న అతిపెద్ద ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ ఇదే కావటం గమనార్హం. అదే సమయంలో దేశంలో ఇకపై కొత్త స్టోర్లు ఏవీ తెరవకూడని నిర్ణయం తీసుకుంది. భారత్ లో విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. దేశంలోని మిగితా స్టోర్లు, ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ల కార్యకలాపాలను కూడా పునర్ వ్యవస్తీకరించే అవకాశం ఉందంటున్నారు. దేశంలో కాష్ అండ్ క్యారీ బిజినెస్ కు భవిష్యత్ లేదని వాల్మార్ట్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నట్లు సమాచారం.
మరింత మంది తొలగింపు...
ఇప్పటికే మూడోవంతు టాప్ ఎగ్జిక్యూటివ్స్ ను తొలగించిన వాల్మార్ట్ ... ఏప్రిల్ లోగా మరింత మందిని ఉద్యోగాలు మానేయాలని కోరే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో కేవలం సీనియర్ లెవెల్ ఉద్యోగులే కాకుండా ఇతరులు కూడా ఉంటారని తెలుస్తోంది. కాగా ఎంత మంది ఉద్యోగులను తొలగించింది వెల్లడించని కంపెనీ... తొలగించిన వారికి మెరుగైన పరిహారం అందజేస్తున్నట్లు పేర్కొంది. అలాగే వారికి అవుట్ ప్లేసెమెంట్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో భారత్ లోని తమ సభ్యులకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన విధంగా కంపెనీ కార్యాచరణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వాల్మార్ట్ ప్రతినిధి చెప్పారు.
నష్టాల బాట...
2007 లోనే ఇండియా లోకి ప్రవేశించిన వాల్మార్ట్ తొలుత ఎయిర్టెల్ మాతృ సంస్థ ఐన భారతి తో జట్టుకట్టింది. కానీ 2013 లో తమ భాగస్వామ్యానికి స్వస్తి పలికాయి. తర్వాత ఒంటరిగానే దేశంలో సేవలు విస్తరించింది. కానీ ఇప్పటి వరకు లాభాల బాట పట్టలేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వాల్మార్ట్ రూ 4,095 కోట్ల ఆదాయంపై రూ 171 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మొత్తంగా కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు వాల్మార్ట్ ఇండియా లో రూ 2,180 కోట్ల మేరకు నష్టపోయింది. కాష్ అండ్ క్యారీ విభాగంలో ఇండియాలో మెట్రో మార్కెట్ లీడర్ గా ఎదిగింది. వాల్మార్ట్ ఇండియా బిజినెస్ ను టాటా గ్రూప్ కొనుగోలు చేయాలని భావించినా... ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మోడల్ లాభదాయకం కాదని వెనక్కి తగ్గిందని మార్కెట్ వర్గాల సమాచారం.
ఫ్లిప్కార్ట్ తో తంటా...
రెండేళ్ల క్రితం రూ లక్ష కోట్లకు పైగా వెచ్చించి ఫ్లిప్కార్ట్ ను కొనుగోలు చేసిన వాల్మార్ట్... మరింత ఇబ్బందుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫ్లిప్కార్ట్ నష్టాలు కూడా ఈ కంపెనీ బుక్స్ లో ప్రతిబింబిస్తుండటంతో మొత్తంగా వాల్మార్ట్ పేరెంట్ కంపెనీ లాభదాయకత ప్రభావితం అవుతోంది. అందుకే భారత్ లో బిజినెస్ ను టర్న్ అరౌండ్ చేయాలనీ, లేదా వేగంగా కార్యకలాపాలను తగ్గించాలని పేరెంట్ కంపెనీ ఆదేశించినట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రస్తుతం ఉద్యోగుల కోత, స్టోర్ల మూత వంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు. అన్ని బిజినెస్ విభాగాలు కూడా ఫ్లిప్కార్ట్ తో ఇంటెగ్రేటె చేస్తున్నట్లు సమాచారం.